దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.పోలీసులు సైబర్ నేరాలను తగ్గించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా, ప్రజలకు చాలా రకాలుగా అవగాహన కల్పిస్తున్నా.
సైబర్ నేరస్థులు మాత్రం సరి కొత్త విధానాలు ఎంచుకుని పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగల్గుతున్నారు.ఇన్ని రోజులు ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, డబ్బులు గెలిచారని మెసేజ్లు పంపించి ప్రజలను మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లు, చివరకు నేరం చేయడానికి పెంపుడు జంతువులను కూడా పావుగా ఎంచుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే, పూణేకు చెందిన ఓ యువకుడికి కుక్క పిల్లలను పెంచుకోవడంఅంటే చాలా ఇష్టం.ఇదే క్రమంలో విదేశీ జాతికి చెందిన కుక్కు పిల్ల అమ్మకం గురించి ఫేసుబుక్లో ఒక పోస్ట్ చూశాడు.అయితే, కుక్కు పిల్లను అమ్మే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడగా రూ.9 వేలకు అమ్మడానికి సదరు వ్యక్తి ఒప్పుకున్నాడు.అనుకున్న ఒప్పందం ప్రకారం 9 వేల రూపాయలను అమ్మే వ్యక్తికి కొనే వ్యక్తి గూగుల్ పే యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు.
అయితే, డబ్బులు పంపిన తర్వాత కుక్కు పిల్ల ఇంటికి తేకపోవడంతో ఆ యువకుడు సదరు వ్యక్తికి ఫోన్ చేసి అడిగాడు.దీంతో కుక్క పిల్ల చనిపోయిందని నిందితుడు చెప్పగా, డబ్బులు తిరిగి ఇవ్వమని యువకుడు అడగడంతో నిందితుడు ఫోన్ కట్ చేసి స్విచ్ఛాఫ్ కూడా చేశాడు.దీంతో సైబర్ నేరస్థుడు తనను మోసం చేశాడని తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కుక్క పిల్లను అమ్మకం పేరుతో సైబర్ నేరస్థుడు మోసం చేశాడని పూణే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మకూడదని, సదరు వస్తువులను నేరుగా పరిశీలించిన తర్వాతే డబ్బులు చెల్లించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.