ఏపీలో రాజకీయంగా బలం పెంచుకుని అధికారంలోకి రావాలని పవన్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.దీనికి తగ్గట్టుగానే పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా, అందుకు అనువైన వాతావరణం ఏర్పడడం లేదు.
పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఇదే విధంగా ప్రజల్లో కి వచ్చి, అధికారంలోకి రావాలని చూసినా, జనసేన కంటే ఎక్కువ ఊపు కనిపించినా, అధికారం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.ఆ తరువాత పరిణామాల క్రమంలో ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో చిరంజీవి విలీనం చేశారు.
ఇప్పుడు ఏపీలో జనసేన పరిస్థితి చూస్తే ప్రజారాజ్యం స్థాయిలో కాకపోయినా, ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ను ప్రభావితం చేసే స్థాయిలో జనసేన ఉంది.
పవన్ కు ఉన్న సినీ గ్లామర్ తో పాటు, కాపు సామాజికవర్గం అండదండలు ఉండడంతో ఎప్పటికైనా బిజెపి సహకారంతో ఏపీలో అధికారంలోకి వస్తామనే ధీమా తో ఉన్నారు.
కాకపోతే అందుకు తగ్గ అనువైన పరిస్థితులు లేకపోవడమే ఇబ్బందికరంగా మారింది.టిడిపి, వైసిపి వంటి బలమైన పార్టీల ను ఎదుర్కోలేక 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి జనసేన పరిమితం అయిపోయింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు జనసేన కు అనుకూలంగా మారినట్టుగా కనిపిస్తున్నాయి.ఒకవైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రభావం కోల్పోతూ, రోజురోజుకు బలహీనం అవుతోంది.
అలాగే అధికార పార్టీ వైసీపీ పై జనాల్లో ఉన్న నమ్మకమూ క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినట్లుగా వివిధ సర్వేల్లో తేలింది.జగన్ పరిపాలన తీరుపైనా అనేక విమర్శలు ఎదురవడం, కోర్టులలోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఏపీ ప్రభుత్వం అప్రదిష్టపాలు అవుతున్న క్రమంలో జనసేన బలపడేందుకు ఇదే అనువైన సమయంగా కనిపిస్తోంది.ఏపీ లో నెలకొన్న ప్రజా సమస్యలపై బిజెపి సహకారంతో పవన్ నిరంతరంగా పోరాటం చేపడితేనే, రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జనసేన అధికారం దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.