కరోనా వైరస్ ఇప్పుడు యావత్ భారత దేశాన్నే గడగడలాడిస్తోంది.వాక్సిన్ కొరత, ఆక్సిజన్ సిలిండర్ కొరత, కరోనా భయం ఇలా ఎన్నో కారణాలతో ఎంతోమంది ఆకస్మాత్తుగా మరణిస్తున్నారు.
దేశ విదేశాలు సైతం భారత్ లో పెరుగుతున్న కేసులను చూసి ఆందోళన చెందుతున్నాయి .మరెన్నో దేశాలు తమకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నాయి.చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు .ఈ సందర్భంగా అన్ని పాఠశాలలకు చాలా రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి . ఏపీ, తెలంగాణలోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక అక్కడ పూర్తిగా సెలవులు ప్రకటించడంతో, ఏపీ లో జగన్ పైన ఒత్తిడి పెరుగుతోంది .తొమ్మిదో తరగతి వరకు పాఠశాలల సెలవులు ప్రకటించిన జగన్ ప్రభుత్వం, పది ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.అందుకే ఆ క్లాసు చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు సెలవులు ప్రకటించలేదు.
దీనిపై తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా పోరాటాలు, ఆందోళన నిర్వహిస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ విషయం పైనే పోరాటం చేస్తున్నారు.తాజాగా ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు సైతం లోకేష్ లేఖ రాసి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని, పక్కనే ఉన్న తెలంగాణలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేసి పై తరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారని, కానీ ఏపీలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న జగన్ మాత్రం మొండి పట్టుదలతో వ్యవహరిస్తున్నారని, టిడిపి విమర్శలు చేస్తోంది.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆందోళనలు నిర్వహించినా, తాము మాత్రం వెనక్కి తగ్గము అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం పంతానికి వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది .
ఈనెల 29వ తేదీన విద్యాశాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించ తలపెట్టారు.జగన్ దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.అయితే ఈ నిర్ణయం ఏదో కాస్త ముందుగానే తీసుకుంటే మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఏపీలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, పది ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవాల్సిందే.
అదేదో కాస్త ముందుగా తీసుకుంటే జగన్ పైన అనవసర నిందలు వచ్చేవి కావు. టిడిపి ఈ విషయంలో పోరాటం చేసేందుకు అవకాశం సైతం ఏర్పడి ఉండేది కాదు.
కానీ ఈ విషయంలో జగన్ సత్వరమే తీసుకోకపోవడమే ఈ వ్యవహారంలో ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి రావడానికి కారణంగా కనిపిస్తోంది.