కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడం అంటూ ఏపీ సర్కార్ కూల్చివేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు జగన్ సర్కార్ దృష్టి మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ పై పడింది.
ఈ క్రమంలో ఆ నివాసం అక్రమ కట్టడం అంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట పై నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు సీఆర్డీఏ అధికారులు సిద్ధమౌతున్నారు.
ఏపీ సర్కార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడ నిర్మించిన అక్రమ కట్టడాల యజమానులు అందరికీ కూడా అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.లింగమేని గెస్ట్ హౌస్కు చేరుకున్న సీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ నరేంద్ర అక్కడ నోటీసులు అంటించారు.
గత నాలుగేళ్లుగా లింగమనేని గెస్ట్ హౌస్లో నివాసం ఉంటున్న చంద్రబాబు తన అధికారిక కార్యక్రమాలను ఇక్కడే నుంచే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఎలాంటి నిర్మాణ అనుమతులు పొందకుండా భవనాన్ని నిర్మించారని,నిబంధనలకు విరుద్ధంగా ఎకరం 6 సెంటర్ల లో అక్రమంగా భవనాన్ని నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు.
అలానే భవన నిర్మాణం,స్విమ్మింగ్ పూల్,హెలిప్యాడ్ నిర్మాణాలు ఇలాంటి విషయాల్లో కూడా సరైన ప్రమాణాలు పాటించలేదు అంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది.అలానే ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ 10 తాత్కాలిక షెడ్లను నిర్మించారని ఏడు రోజుల్లోగా స్వచ్ఛందంగా ఆ నిర్మాణాలను కూల్చివేయాలని లేదంటే సీఆర్డీఏ ఆ పనికి పూనుకోవాల్సి వస్తుంది అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.దీనితో ఏడురోజుల్లో ఈ నిర్మాణాలపై సంజాయిషీ ఇచ్చుకోకపోతే ఆ నిర్మాణాన్ని కూల్చడానికి సీఆర్డీఏ అధికారులు పూనుకొనే అవకాశం కనిపిస్తుంది.