2014 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు.2014 ఎన్నికల్లో జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వగా ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.అయితే ఐదేళ్ల టీడీపీ పరిపాలనలో చంద్రబాబుపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత అంతాఇంతా కాదు.దీంతో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇవ్వకుండా వామపక్షాలతో కలిసి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు.అయితే ఏపీలో పెద్దగా ప్రభావం చూపలేని వామపక్షాలతో కలిసి పోటీ చేయడం వల్ల ఇరుపార్టీలు నష్టపోయాయి.
2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ రెండు స్థానాల్లో పోటీ చేసినా ఆయనను విజయం వరించలేదు.అయితే జనసేన పార్టీ తరపున రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రం విజయం సాధించారు.అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నెలల తరువాత జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి.
భవిష్యత్తులో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని వెల్లడించాయి.బీజేపీ జనసేన పొత్తు తరువాత సైలెంట్ గా ఉన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.పనిలో పనిగా ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్, చంద్రబాబు, పవన్ తీరుతో తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని చెప్పారు.పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేసుకున్నారని అన్నారు.
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల వల్ల దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.వైసీపీ, టీడీపీ పార్టీలు వ్యవసాయ బిల్లులకు మద్దతు పలకడం దారుణమని పేర్కొన్నారు.పవన్ మోదీ కాళ్లు పట్టుకున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అమరావతి విషయంలో తమ వైఖరి మారలేదని చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు కూడా పడుతుందని చెప్పారు.