రాజకీయాలలో ఫిరాయింపులు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయాయి.ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచి తర్వాత అధికారంలో ఉన్న పార్టీలోకి చాలామంది నేతలు తమ స్వలాభం కోసం వెళ్ళిపోతున్నారు.
దానికి వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీ లోకి వెళ్తున్నట్లు కథలు చెబుతున్నారు.అయితే ఇలా ఫిరాయింపులు వెనుక భారీగా నగదు బదిలీ జరుగుతుందని రాజకీయ వర్గాల్లో వినిపించే బహిరంగ రహస్యం.
తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకుంది.దీనికి ఆపరేషన్ ఆకర్ష్ అని పేరు పెట్టింది.
గతంలో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు టీడీపీ అధినేత చంద్రబాబు కట్టబెట్టారు.
ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అధినేత జగన్ మాత్రం తన పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చోటులేదని నిర్మొహమాటంగా స్పష్టం చేశాడు.
ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవకపోయినా కూడా సిపిఐ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో బలంగా నడిపిస్తున్న సిపిఐ నారాయణ ఫిరాయింపు ఎమ్మెల్యే లను ఉద్దేశించి కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ప్రజలు ఎన్నుకున్న పార్టీ నుంచి అధికార పార్టీలోకి మారే ఎమ్మెల్యేలు కంటే ముంబై రెడ్ లైట్ ఏరియా లో ఉన్న వాళ్లే నయం అని నారాయణ వ్యాఖ్యలు చేశారు.
బిజెపితో సహా దేశంలో ఏ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని అన్నారు.ఇప్పుడు నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.