కరోనా బాధితుల పరిస్థితి దారుణంగా మారింది.కనీస వసతులు లేక, వైద్య సౌకర్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.
మెరుగైన సేవలు అందించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.కొన్ని చోట్లల్లో వైద్యులు తమ తీరు మార్చుకోవడం లేదని, కోవిడ్ బాధితులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా బాధితులకు మెరుగైన వసతులు, వైద్య సదుపాయాలు అందించాలని స్పష్టం చేసినప్పటికీ కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుల తీరు మారడం లేదు.వైద్యులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితులు నిరసనకు పాల్పడ్డారు.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ లో కరోనా బాధితులు శనివారం నిరసన చేపట్టారు.మెరుగైన వైద్యం, బాధితుల పర్యవేక్షణ, కనీస వసతులు, పౌష్టికాహారం అందించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
కరోనాతో పోరాడుతున్న బాధితులకు మెరుగైన సదుపాయాలు అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.వసతులు కల్పించనప్పుడు ఇంటికైనా పంపియ్యాలని, వేరే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతామంటున్నారు.ఈ వైద్యంతో ప్రాణాలు పోయేలా ఉందని ఆరోపిస్తున్నారు.ఇలానే కొద్ది రోజులు వైద్యం తీసుకుంటే చచ్చిపోవడం ఖాయమన్నారు.
ఆస్పత్రిలో కరోనా బాధితులు ఆందోళన చేసిన వీడియోను చిత్రికరించి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.