కరోనా నుంచి మానవాళిని కాపాడేందుకు డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.ఇప్పటికే పలువురు డాక్టర్లు వైరస్ సోకి మరణించగా, మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రపంచంలోనే కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న అమెరికాలోనూ వైద్యులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు.ఈ లిస్టులో భారతీయ అమెరికన్ డాక్టర్లు కూడా ఉన్నారు.
తాజాగా భారత సంతతికి చెందిన డాక్టర్ సుధీర్ ఎస్ చౌహన్ కోవిడ్ 19తో ప్రాణాలు కోల్పోయారు.
న్యూయార్క్లో స్ధిరపడిన సుధీర్ స్థానిక జమైకా ఆసుపత్రిలో ఇంటర్నల్ మెడిసిన్ ఫీజిషియన్గా, అసోసియేట్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.1972లో భారత్లోని కాన్పూర్ యూనివర్సిటీ అనుబంధ జీఎస్యూఎం మెడికల్ కాలేజీలో ఆయన వైద్య విద్యను అభ్యసించారు.అనంతరం జమైకా ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్లో బోర్డు సర్టిఫైడ్ వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన సుధీర్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ మే 19న తుదిశ్వాస విడిచారు.అంతకు ముందు భారత సంతతికి చెందిన వైద్యులైన తండ్రీకూతుళ్లు కోవిడ్ 19 సోకి న్యూజెర్సీలో మరణించారు.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషీయన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ)కి చెందిన సుమారు 80,000 మంది డాక్టర్లు అమెరికాలో కరోనాపై పోరాడుతున్నారు.వీరికి అదనంగా 40,000 మంది వైద్య విద్యార్ధులు, రెసిడెంట్లు, ఫెలోలు అక్కడి ఆరోగ్య సంరక్షణ విధుల్లో పాలు పంచుకుంటున్నారు.అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్లు ఒక శాతం కన్నా తక్కువే ఉన్నప్పటికీ.అమెరికన్ వైద్యరంగంలో 9 శాతం వాటా కలిగివున్నారు.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రతి ఏడుగురు వైద్యులలో ఒకరు భారతీయ సంతతికి చెందినవారే కావడం విశేషం.కాగా యూఎస్లో ఇప్పటి వరకు 1.58 మిలియన్ల మందికి కరోనా సోకగా.93,806 మంది ప్రాణాలు కోల్పోయారు.