కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోంది.నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ, మరింత వేగంగా ఈ వైరస్ మహమ్మారి విస్తరిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది.
ఇప్పుడు ఎక్కడికక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.ప్రజల్లో ఆందోళన కూడా అదే రేంజ్ లో పెరిగిపోతోంది.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు ఆందోళన కలిగించే స్థాయిలో పెరిగిపోతున్నాయి.మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా టెస్ట్ లు ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి.
వైరస్ లక్షణాలు ఉన్న వారిని తరలించి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఎక్కడికక్కడ వైరస్ విస్తరించకుండా, ఆయా ప్రాంతాలను రెడ్ జోన్ పరిధిలోకి తెస్తూ, కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు ఏపీలో విస్తరిస్తున్న కరోనా గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఇప్పటి వరకు అనారోగ్యంగా ఉన్న వారికే కరోనా వైరస్ లక్షణాలు కనిపించగా, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వారిలో ఈ లక్షణాలు బయట పడడం, వైరస్ సోకిన వారు కొద్ది గంటల్లోనే మృతి చెందడం వంటి సంఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయి.
వీరిని పరీక్షించి చూడగా, ఇతర అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు.ఏ లక్షణాలు లేకుండానే అకస్మాత్తుగా మరణిస్తూ ఉండడం కూడా ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ తరహా మరణాలు ఏపీలో ఎక్కువ నమోదు అవ్వడంతో వైద్యశాఖ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారట.
తాజాగా విజయవాడ ఏఆర్డీ సెంటర్ లో పనిచేస్తున్న ఒక వైద్యుడు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతోందని చెప్పగా, అతడికి వైద్యం అందించే సమయంలోపే ఆయన ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.అలాగే తూర్పుగోదావరి జిల్లా పెదపూడి లోనూ ఇటువంటి మరణం సంభవించడం, లక్షణాలు కనిపించిన అరగంటలోనే మరణించడం వంటి పరిణామాలు ఇప్పుడు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఈ విధంగా కొన్ని గంటల్లోనే ఏపీలో ఎన్నో మరణాలు సంభవించడంతో కరోనా లక్షణాలు లేని రోగులు అప్రమత్తంగా ఉండాలని, నిత్యం అప్రమత్తంగా ఉంటూ, స్వీయ జాగ్రత్తలు తీసుకుని ప్రాణాలు కాపాడుకోవాలని, వైద్యులు సూచిస్తున్నారు.