కొన్ని సందర్భాల్లో చెడులో కూడా మంచి జరుగుతుంది.దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రజలందరికీ కరోనా వల్ల చెడు జరిగినా కొందరికి మాత్రం మంచే జరిగింది.నూరుద్దీన్ అనే వ్యక్తి 33సార్లు పదో తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ కాగా కరోనా వల్ల 34వ సారి ప్రయత్నం చేయకుండానే పాసయ్యాడు.1987 నుంచి ప్రతి సంవత్సరం పరీక్షలు రాస్తున్నా ఆయన ఇప్పటివరకు పాస్ కాలేదు.
పూర్తి వివరాలలోకి వెళితే నిరుపేద కుటుంబంలో జన్మించిన మహ్మద్ నూరుద్దీన్ ప్రస్తుతం భోలక్ఫూర్ అంజుమన్ బాలుర ఉన్నత పాఠశాలలో వాచ్మన్గా పని చేస్తున్నాడు.
ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.వాచ్ మన్ గా పని చేస్తున్న సమయంలో నూరుద్దీన్ కు బాగా చదువుకోవాలని కోరిక పుట్టింది.1987లో మొదటిసారి ప్రైవేట్గా పదో తరగతి పరీక్ష రాసిన నూరుద్దీన్ ప్రతి సంవత్సరం ఫెయిల్ అవుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పరీక్ష కోసం నూరుద్దీన్ ఫీజు చెల్లించాడు.
కరోనా వైరస్ విజృంభణ వల్ల పరీక్షలు వాయిదా పడగా తాజాగా ఫీజు కట్టిన వారందరినీ ప్రమోట్ చేస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అలా నూరుద్దీన్ కూడా పరీక్ష పాసయ్యాడు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పరీక్షలు రాశానని… ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం వల్ల పరీక్ష ఫెయిల్ అయ్యేవాడినని… ప్రభుత్వం ఈ సంవత్సరం అందరినీ పాస్ చేయడంతో తన కోరిక నెరవేరిందని మీడియాకు తెలిపారు.