ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పటికే కొన్ని దశలు పూర్తి కాగా మరి కొన్ని దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇదే సమయంలో తెలంగాణలో స్థానిక సంస్థలు అయిన ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి.అయిదు నెలలుగా తెలంగాణలో ఏదో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.
ఎన్నికలు అంటే చిత్రాలు, సిత్రాలు ఎన్నో మనం చూస్తూనే ఉంటాం.ఎన్నికల్లో అన్నా తమ్ముడు పోటీ పడడం, ఒకే ఇంట్లో ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయడం వంటివి చూస్తూ ఉంటాం.
ఇక ఎన్నికల ప్రచారం సమయంలో అభ్యర్థులు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
ఇప్పటి వరకు మనం చూసిన సిత్రాలకు తాజాగా కరీంనగర్లో జరిగిన వింత తాత అనుకోవచ్చు.ఎన్నికల వల్ల బంధాలు దెబ్బ తినడం ఇప్పటి వరకు చూశాం.
కాని ఈ ఎన్నిక కారణంగా అయిదు ఏళ్లుగా విడిపోయి దూరంగా ఉంటున్న భార్య భర్తలు కలిసి పోయారు.ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతే గ్రామంలో జరిగింది.
మోతే గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా కలిగేటి లక్ష్మణ్ కార్యకర్తగా పని చేస్తున్నాడు.చాలా ఏళ్లుగా సర్పంచ్ లేదా ఎంపీటీసీగా పోటీ చేసేందుకు అతడు ఆసక్తి చూపుతున్నాడు.స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా అతడికి సీటు ఇవ్వాలని భావించినా రిజర్వేషన్స్ లేదా ఇతరత్ర సమీకరణల వల్ల అతడికి సీటు ఇవ్వలేక పోతున్నారు
తాజాగా ఎంపీటీసీ స్థానంకు ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని భావించాడు.నాయకులు సైతం ఆయనకే సీటు అంటూ చెప్పుకొచ్చారు.అయితే ఆ స్థానంను ఈసీ మహిళకు కేటాయించడం జరిగింది.లక్ష్మణ్ కు పెళ్లి అయితే అయ్యింది కాని, అయిదు సంవత్సరాలుగా భార్య నుండి దూరంగా ఉంటున్నాడు.కుటుంబ తగాదాల కారణంగా ఆమెను దూరంగా ఉంచుతున్నాడు.ఇద్దరు విడాకులు అయితే తీసుకోలేదు కాని అయిదు సంవత్సరాలుగా విడి విడిగా ఉంటున్నారు.
లక్ష్మణ్ భార్యతో కలిసి ఉండని కారణంగా ఈసారి కూడా అతడికి కాకుండా మరెవ్వరికి అయినా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఆ సమయంలోనే స్థానికులు పలువురు లక్ష్మణ్కు భార్యను తీసుకు వచ్చి పోటీ చేయించమని సలహా ఇచ్చారు
లక్ష్మణ్ కోరుకుంటే ఆయన భార్యకు సీటు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ నాయకులు కూడా అన్నారు.దాంతో లక్ష్మణ్ తన భార్యను తీసుకుని వచ్చాడు.భార్యతో నామినేషన్ వేయించాడు.ప్రస్తుతం ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.9 ఏళ్ల క్రితం వీరి పెళ్లి అయితే, 5 సంవత్సరాలుగా ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు.ఎట్టకేలకు వీరిద్దరు కలిసేందుకు ఎన్నికలు సాయం చేశాయి.