పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన
ఉపాధి హామీ పథకం
అక్రమార్కులకు ఉపాధి వనరుగా మారింది.ఉపాధి పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడుతున్నారు.
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో 15 పంచాయతీలు ఉండగా, రెండు మూడు గ్రామాలు మినహా అన్ని గ్రామాల్లో ఈ అవినీతి బాగోతం యథేచ్ఛగా కొనసాగుతోంది.గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనుల్లో కూలీలు పనులు చేయకుండానే 1000 నుంచి 1600 రూపాయలపైనే వేతనాల బిల్లులు పెడుతున్నారు.
అయితే కూలీలకు డబ్బులు ఇవ్వకపోగా, తక్కువ కూలీ చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లోని చెరువుల్లో చేసిన పనులను ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు కొలతలు తీసి ఉన్న పనులకు అధికంగా మూడు రెట్లు పనులు చేసినట్లు చూపించి ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారు.
పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు.ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు అందినా ఉన్నతాధికారులు స్పందించడం లేదు.ఇలా అవినీతి వ్యవహరం తారస్థాయికి చేరింది.అయితే గ్రామంలో అరకొరగా పనులు చేసి కొలతలు తీసీ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు కూలీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
పంచాయతీ పరిధిలో నివాసం ఉండని, గ్రామంలో ఉండి ఉపాధి హామీ పనులకు రాకుండా వేరే పనులకు వెళ్లే వారికి మస్టర్లు వేసి నిధులు మింగేస్తున్నారు.హైదరాబాద్, ఏలూరు, కరీంనగర్, పాల్వంచలో ఉంటున్న వారి పేరుతో మస్టర్లు వేసి యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో కూలీలు ఫిర్యాదు చేశారు.అవినీతికి సంబంధించిన ఆధారాలను అందజేశారు.అయినా అక్రమార్కులపై చర్యలు శూన్యమయ్యాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.