యువత అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు.తన కోసమే కాకుండా తన చుట్టు ఉన్న వారి కోసం కూడా కొందరు యువత కష్టపడి పని చేయడం మనం ఇప్పటి వరకు చూశాం.
అయితే తన స్వార్థంను ఎంతో కొంత అయినా ఆ పనిలో చూసుకుంటూ ఉంటారు.కాని రాజస్థాన్కు చెందిన ఛావి రాజవత్ మాత్రం తన బంగారంలాంటి జీవితాన్ని వదులుకుని గ్రామం కోసం కష్టపడింది.
ఆమె దశాబ్ద కాలం పాటు ఊరి కోసం చేసిన సేవకు గాను ఏకంగా ఐక్యరాజ్య సమితి నుండి పిలుపు వచ్చింది.ఆమె రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఆదర్శ మహిళగా గుర్తింపు దక్కించుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్లే ఢిల్లీలోని ప్రముఖ యూనివర్శిటీలో ఎంబీఏను పూర్తి చేసిన ఛావి రజావత్ ప్రముఖ కంపెనీలో ఆరంభంలోనే రూ.80 వేల నెలవారి జీతంతో ఉద్యోగం సంపాదించుకుంది.ఉద్యోగం వచ్చిన సంతోషంను పంచుకునేందుకు తన తల్లిదండ్రులు ఉండే గ్రామం అయిన సోడాకు వెళ్లింది.సోడా ఒక సాదారణ పల్లెటూరు.అక్కడ రైతులు, సామాన్యులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వ పథకాల గురించి కనీస అవగాహణ లేకపోవడంతో పాటు, ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు.
తన ఊరి పరిస్థితిని చూసి చలించి పోయిన ఛావికి తనవంతుగా ఏమైనా చేయాలనిపించింది.ఉద్యోగం వచ్చిన విషయం తెలిసి చాలా మంది గ్రామస్తులు ఛావిని అభినందించేందుకు వచ్చారు.ఆమె వారి ఆప్యాయతకు తనవంతు సాయం చేయాలని భావించింది.ఒక రోజంతా ఆలోచించి వెంటనే తనకు వచ్చిన ఉద్యోగంకు ఊరి నుండే రాజీనామా చేసింది.ఆమె రాజీనామా కారణం చెబుతూ నాకు జన్మనిచ్చిన గ్రామం కోసం నేను ఏమైనా చేయాలనుకుంటున్నాను, అందుకోసం నేను ఇక్కడే ఉండాల్సి ఉంది అంటూ ఆమె పేర్కొంది.
ఉద్యోగంకు రాజీనామా చేసిన ఆమె ఊర్లోనే ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం చూపుతూ వచ్చేంది.ఆ సమయంలోనే సర్పంచ్ ఎన్నికలు రాగా ఏకగ్రీవంగా ఛావిని సోడా గ్రామస్తులు ఎన్నుకున్నారు.సర్పంచ్గా ఆమె ఆ గ్రామంలో ఎన్నో అద్బుతాలను సృష్టించారు.
ప్రభుత్వం నుండి నిధులను సేకరించడంతో పాటు స్వచ్చంద సంస్థలతో మాట్లాడి గ్రామంకు సాయం చేసేలా చేసంది.గ్రామంలో నీటి నిల్ల కోసం చెరువులను తవ్వించింది, రైతులు వ్యవసాయంలో యంత్రాలను ఉపయోగించడంలో మెలకువలు నేర్పించింది.
గ్రామంలో తాగు నీటి సమస్య అనేది లేకుండా తన వంతు కృషి చేసింది.గ్రామంలో ఏ ఒక్కరు ఇళ్లు లేకుండా ఉండకూడదని ఇళ్లు మంజూరు చేయించింది.ఇక గ్రామంలో 40 రోడ్లు, తన హయాంలోనే 800 టాయిలెట్స్ను ఛావి నిర్మించింది.కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఆమె మొత్తం ఊరు ముఖ చిత్రంను మార్చేసి జిల్లా మాత్రమే కాకుండా దేశం మొత్తం ఆ గ్రామం వైపు తిరిగి చూసేలా తనవంతు బాధ్యత నిర్వర్తించింది.
తమ గ్రామంలో కొన్ని కంపెనీలు ఫ్యాక్టరీలను కట్టేందుకు ప్రభుత్వం వద్ద అనుమతులు తీసుకున్నా కూడా ఆ ఫ్యాక్టరీల వల్ల ఆరోగ్యాలు దెబ్బ తినడంతో పాటు, వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉందనే ఉద్దేశ్యంతో ఆమె గ్రామస్తుల్లో చైతన్యం తీసుకు వచ్చి ప్యాక్టరీలను పారిపోయేలా చేసింది.ఆ కోపంతో కొందరు ఛావిపై దాడికి కూడా ప్రయత్నించారు.
ఏం చేసినా ఆమె మాత్రం భయపడకుండా ముందడుగు వేసి తన గ్రామం కోసం కష్టపడుతూనే ఉంది.