కార్పొరేట్ ప్రపంచం రాజ్యమేలుతోంది.రానురాను చిరు వ్యాపారులకు సైతం కార్పొరేట్ బొక్క పెడుతోంది.
ఇక సామాన్యుల సంగతి సరేసరి.మనం వట్టి గొర్రెలం కదా.మనల్ని ఈ కార్పొరేట్ జనాలు, రాజకీయ నాయకులు చాలా తేలికగా బుట్టలో పడేస్తారు.ఎందుకంటే మనం విన్నది, చూసింది అలాగే నమ్మేస్తుంటాం.
బేసిగ్గా వీరు మసిపూసి మారేడుకాయ చేయడంలో మంచి దిట్ట.మనిషి రోజువారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి తర్వాత అదే అద్భుతమన్నట్లు మన బుద్ధిలో చొప్పించడమే కార్పోరేట్ కల్చర్.
అందుకే కార్పోరేట్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
ఘోరమైన కల్తీ పాలను మనకు అలవాటు చేసి స్వచ్ఛమైన పాలు అంటూ వందల కోట్ల వ్యాపారం నేడు చేసుకుంటున్నారు.
మనకు అవసరం ఉన్నా లేకపోయినా గోబెల్స్ ప్రచారంతో సగటు మానవుడు వారి బ్రాండ్లకు అలవాటు పడేలా చేస్తున్నారు.ఎంతలా అంటే వేప పుల్ల దగ్గరి నుండి మన సంస్కృతిలో భాగమైన పండుగలు, వాటి ఆచారాలను క్యాష్ చేసుకుంటూ కూడా పబ్బం గడుపుకుంటున్నాయి.
చివరికి పిడకలను కూడా అమ్ముకుంటూ అదేదో మన మంచికే అన్నట్లుగా ప్రచారం చేస్తూ లబ్దిపొందుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.షాపింగ్ మాల్స్, అద్దాల మేడల్లో ఇలాంటి అందమైన మోసాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి.
ఉదాహరణకు ఒకప్పుడు వేపపుల్ల, బొగ్గుతో పళ్లు తోముకున్న భారతీయులకి అవి తప్పని చెప్పి టూత్ పేస్ట్ అలవాటు చేశారు.మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? మీ టూత్ పేస్ట్లో బొగ్గు ఉందా? మీ టూత్ పేస్ట్లో వేప ఉందా అని ఇలా రకరకాలుగా అడిగి మళ్లీ మన పాత అలవాట్లే మనకి కొత్తగా నేర్పిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? వీరు జనాలకి అరచేతిలో ప్రపంచాన్ని పరిచయం చేసి మనం ఆర్డర్ చేసిన గంటల్లో వస్తువులతో మన వాకిలిలో వచ్చి వాలిపోతారు.ఇంకేముంది… పేదోడి జేబుకు చిల్లులు.కార్పోరేట్లకు కాసుల పల్లకీలు… జాగ్రత్తగా ఆచితూచి మసులుకోండి మిత్రులారా!
.