అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.అధికారికంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించనప్పటికీ, జనం వైరస్ భయంతో గడప దాటి బయటకు రావడం లేదు.
వీరి పరిస్ధితి ఇలా ఉంటే ఇళ్లు లేని నిరాశ్రయుల జీవితం మరింత దుర్భరంగా మారింది.ఈ క్రమంలో లాస్వేగాస్లోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి.
నగరంలోని క్యాథలిక్ ఛారిటీస్ నిరాశ్రయులకు చాలా కాలం నుంచి వసతి ఏర్పాటు చేస్తోంది.
ఈ క్రమంలో అక్కడ ఆశ్రయం పొందుతున్న ఓ వ్యక్తికి గత వారం కరోనా పాజిటివ్గా తేలడంతో ఈ షెల్టర్ను మూసివేశారు.
దీంతో అక్కడ ఉన్న 500 మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందేందుకు మరో కొత్త ప్రాంతం కోసం వెతుక్కుంటున్నారు.ఇక్కడికి దగ్గరలోని కోర్ట్యార్డ్ హోమ్లెస్ రిసోర్స్ సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎక్కువమందికి ఆశ్రయం కలిపించలేకపోయింది.
ఈ నేపథ్యంలో లాస్వేగాస్ సిటీ, క్లార్క్ కౌంటీ, నెవాడా అధికారులు నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయాన్ని కల్పించాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగా నగరంలోని కాష్మన్ సెంటర్ పార్కింగ్ ప్లేస్ను నిరాశ్రయులు నిద్రించేందుకు ఉపయోగిస్తున్నారు.కరోనా నేపథ్యంలో ఇక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారు.లాస్వెగాస్ రివ్యూ జర్నల్ ప్రకారం 50 మంది వాలంటీర్లు 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిరాశ్రయులు నిద్రించేందుకు కార్పెట్ను సిద్ధం చేశారు.
నెవాడాలోని టూరో యూనివర్సిటీ నుంచి దాదాపు డజను మంది వైద్య విద్యార్ధులు వీరి ఉష్ణోగ్రతను పరీక్షించి, మెడికల్ టెస్టులు చేశారు.
నిరాశ్రయుల సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని క్లార్క్ కౌంటీ కమీషనర్ లారెన్స్ అన్నారు.
అయితే నిరాశ్రయులు నిద్రించడానికి చోటు కల్పించేందుకు కృషి చేస్తున్న అధికారులు, వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు .కాగా బుధవారం ఒక్కరోజే అమెరికాలో కరోనా వైరస్ కారణంగా 1,939 మంది మరణించారు.దీంతో అగ్రరాజ్యంలో కోవిడ్ 19 బారినపడి మరణించిన వారి సంఖ్య 14,695కి చేరగా, బాధితుల సంఖ్య 4,35,128కి చేరింది.ప్రపంచంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశంగా అమెరికా నిలిచింది.