చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం 145 దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే.భారత్లోనూ ఇది నెమ్మదిగా కోరలు చాస్తోంది.
ఆ రంగం ఈ రంగం అని లేకుండా ఇప్పటికే ప్రపంచ ఆర్దిక వ్యవస్థను నిండా ముంచిన కోవిడ్-19 సామాజిక సంబంధాలపైనా నేరుగా ప్రభావం చూపుతోంది.భారతదేశంలోని పలు రాష్ట్రాలు కరోనా వ్యాప్తి దృష్టా వివాహలు ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాయి.
తప్పనిసరైతే అతి తక్కువ మంది అతిథుల మధ్యనే వేడుక నిర్వహించుకోవాలని సూచించింది.ఈ నిర్ణయాల వల్ల ప్రవాస భారతీయులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఊపిరి సలపనంత బిజీగా ఉండే ఎన్ఆర్ఐలు అమ్మాయి నచ్చితే వారంలోపే నిశ్చితార్ధం, వివాహం జరిపించుకుని అంతే వేగంగా విమానం ఎక్కి వెళ్లిపోవడం ఎప్పటి నుంచో వస్తుంది.ప్రస్తుతం కరోనా విధ్వంసం నేపథ్యంలో వివాహలు వాయిదా పడుతుండటంతో ప్రవాస భారతీయుల బాధ వర్ణనాతీతం.
అచ్చం అలాంటి కథ పంజాబ్కు చెందిన తేజ్బీర్ సింగ్ అహూజా- అమర్జిత్ కౌర్ అహూజాలది.వీరి కుటుంబం కెనడాలోని ఒంటారియోలో స్థిరపడింది.తేజ్బీర్ కుమారుడు జాస్మీత్కు అబోహర్కు చెందిన అమ్మాయితో మార్చి 29న వివాహం నిశ్చయించారు.
పెళ్లికి ఎన్నో రోజులు లేకపోవడంతో తేజ్బీర్, అమర్జిత్లు జలంధర్ చేరుకుని పెళ్లి పనులను ప్రారంభించారు.
దీనిలో భాగంగా అతిథులకు ఆహ్వానాలు అందించడం, ఫంక్షన్ హాల్ బుకింగ్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గాను కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
విదేశాల నుంచి వచ్చే ఎవరైనా సరే 14 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచడంతో పాటు వివాహాలు, ఇతర శుభకార్యాలపై ఆంక్షలు విధించింది.ఇదే ఇప్పుడు ఈ కుటుంబానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
కెనడాలో ఉన్న పెళ్లి కొడుకు జాస్మీత్ అక్కడి నుంచి భారతదేశానికి చేరుకున్న వెంటనే అతను 14 రోజులు నిర్బంధంలో ఉండాలి.దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన అతని తల్లిదండ్రులు, బంధువులు పెళ్లిని వాయిదా వేయడమే మంచిదని నిర్ణయించింది.