కరోనా కారణంగా ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్ధలు చెల్లాచెదురయ్యాయి.ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి, తిరిగి ఆర్ధిక వ్యవస్ధలు గాడిలో పడటానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్ధితి.
ఇప్పటికే ఆర్ధిక మాంద్యం కారణంగా ఎన్నో రంగాలు తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి.మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా ఇప్పుడు కొత్తగా కరోనా రావడంతో ఆయా రంగాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఇప్పటికే సంపన్న దేశాల్లో ఆర్ధిక వ్యవస్థలు కుదేలవ్వడంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతారని అనేక అధ్యయన సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి.
మరోవైపు భారతదేశంలోనూ గత రెండు నెలల నుంచి లాక్డౌన్ అమల్లో ఉండటంతో ఎన్నో రంగాలు సంక్షోభంలో పడ్డాయి.ఇందులో దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగం కూడా ఉంది.
లాక్డౌన్ కారణంగా రైతులు తాము పండించిన పంటను అమ్మలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అన్నదాతలను ఆదుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూలకు సరిపోవడం లేదు.
ఈ నేపథ్యంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభాస భారతీయులు ముందుకొచ్చారు.ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్ఆర్ఐలు తలో చెయ్యి వేసి రైతుల నుంచి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు.ఇలా కొన్న వాటిని ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదల కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు.అమెరికాలో స్థిరపడిన తెలుగు ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవ రెడ్డి ఇందుకోసం ‘‘టమోటా ఛాలెంజ్’’ అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
దీనిని స్వీకరించిన అనేక మంది ప్రవాస భారతీయులు రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు.
ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చెందిన పలువురు రైతుల నుంచి 40 టన్నుల టమోటాలు, 13 టన్నుల బంగాళాదుంప, రెండు టన్నుల క్యాబేజీ, ఐదు టన్నుల క్యారెట్, 3 టన్నుల వంకాయలను కొనుగోలు చేసినట్లు డాక్టర్ వాసుదేవ రెడ్డి తెలిపారు.రైతులను ఆదుకోవడానికి తాను టమోటా ఛాలెంజ్ విసిరానని.దీనికి సెలబ్రిటీలు, ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన చెప్పారు.