దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో సక్సెస్ కావడం లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజర్ల సహాయంతో తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా మాత్రమే కరోనా నుంచి రక్షించుకోగలమని చెబుతున్నారు.అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేస్తున్నా కొందరు కరోనా నిబంధనలను లెక్క చేయడం లేదు.
నిబంధనలు పాటించకపోవడం వల్ల వాళ్లు వైరస్ బారిన పడటంతో పాటు ఇతరులను సైతం ప్రమాదంలోకి నెడుతున్నారు.వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని సేలం నగరంలో కొత్తగా ఒక వస్త్ర దుకాణం ప్రారంభమైంది.
ఆ షాపు యజమాని బిజినెస్ బాగా జరగాలనే ఉద్దేశంతో 25 రూపాయలకే డ్రస్ అంటూ ప్రచారం చేశాడు.దీంతో సేలం ప్రాంతంలోని జనం ఆ దుకాణం ముందు క్యూ కట్టారు.
అయితే ఆఫర్ ప్రకటించిన వ్యాపారులు కస్టమర్లకు కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు.వ్యాపారం బాగా జరగాలనే ఉద్దేశంతో నిబంధనలను తుంగలో తొక్కి ఆఫర్లను ప్రకటించారు.
భారీ సంఖ్యలో కస్టమర్లు ఆ షాపు ముందు గుమికూడటంతో విషయం పోలీసులకు తెలిసింది.రంగంలోకి దిగిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వస్త్ర దుకాణానికి సీజ్ చేయడంతో ప్రారంభమైన కొన్ని రోజులకే దుకాణం క్లోజ్ అయింది.
సోషల్ మీడియాలో ఈ ఘటన తెగ వైరల్ అవుతోంది.నెటిజన్లు ఈ ఘటన గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే వరకు ఇలాంటి ఆఫర్లను వ్యాపారులు ప్రకటించవద్దని.జనం ఆఫర్ల కోసం ఎగబడితే ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి సాధారణ పరిస్థితులు ఏర్పడేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.