కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశాలన్నీ లాక్డౌన్ అమలు చేయడంతో పాటు సామాజిక దూరం అనే మంత్రాన్ని జపిస్తున్నాయి.వైరస్ చైన్ను తెంపాలంటే ప్రస్తుతం ఇంతకుమించిన మార్గం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కరోనా రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి వెంట తుంపర్లు ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులపై పడతాయి.దీని వల్ల వారికి కూడా వైరస్ సంక్రమిస్తుంది.అందుకే తప్పనిసరిగా ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కనీసం ఆరు అడుగుల మేర దూరం పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ 19 వ్యాప్తి కాస్త తగ్గిన తర్వాత ప్రపంచం మొత్తం లాక్డౌన్ను దశలవారీగా ఎత్తేస్తుంది.అయితే ఆ తర్వాత ప్రజలు ఒక్కసారిగా బయటకు వస్తారు.తిరిగి సాధారణ జీవనం మొదలవుతుంది.
ఉరుకులు, పరుగులు మళ్లీ మామూలే.ఈ నేపథ్యంలోనే హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ హెచ్చరిక చేశారు.
కరోనా ప్రభావం తగ్గి, లాక్డౌన్ను ఎత్తివేసినప్పటికీ 2022 వరకు ప్రజలకు ఖచ్చితంగా సామాజిక, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.లేదంటే ఏ సమయంలోనైనా ఈ వైరస్ తిరిగి మానవాళిపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రాబోయే కాలంలో కరోనా సీజనల్ వ్యాధిగా మారి.శీతల ప్రదేశాల్లో, చలి కాలంలో విజృంభించే అవకాశాలు కొట్టిపారేయలేమని వారు చెబుతున్నారు.