భారత్ లో గడిచిన ఆరు నెలల నుంచి కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.దేశంలో గత కొన్ని రోజులుగా 70,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.
అయితే మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా పాక్ లో మాత్రం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం గమనార్హం.వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలో సైతం కరోనా తగ్గుముఖం పట్టగా వుహాన్ లోని ప్రజలు మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారు.
పాకిస్తాన్ లో మొదట్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభించగా ఇప్పుడు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ఏ.ఎఫ్.పీ అనే ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం పాక్ లో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.పాక్ గతంలో సాధారణ వ్యాధులైన క్షయ, హెపటైటిస్ లను అరికట్టలేకపోయినా కరోనాను మాత్రం సమర్థవంతంగా అరికట్టడంలో సక్సెస్ అవుతుండటం గమనార్హం.
పెద్దపెద్ద దేశాలే కరోనా ఎదుర్కోలేక చేతులెత్తేస్తుంటే తగినంత నిధులు వైద్యానికి అందించని పాక్ ఆ విషయంలో సక్సెస్ అవుతోంది.
లాహోర్ లో ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు సల్మాన్ హసీబ్ ప్రత్యేకంగా కరోనా నియంత్రణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టకపోయినా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెబుతున్నారు.కొందరు మాత్రం పాక్ జనాభాలో యువత ఎక్కువగా ఉందని….
యువతలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్లే వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు అక్కడి వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
పాక్ లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు ఎక్కువమంది 22 ఏళ్లలోపు వాళ్లే కావడం వల్ల కూడా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు మాత్రం తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడం వల్లే కేసులు తక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు.