ఇది కరోనా కాలం.ప్రపంచం అంతా కష్టాల్లో ఉంది.
ఈ మహమ్మారిని అడ్డుకునే మార్గం కనిపించడం లేదు.ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రపంచ మానవాళి అంతా భయం భయంగా గడుపుతున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కేసులు నమోదు అయ్యాయి.ఇంకా పెరిగిపోతున్నాయి.
ముఖ్యంగా భారత్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా, ఎంత కట్టడి చేద్దాం అనుకుంటున్నా, అది కంట్రోల్ కావడంలేదు.
రోజుకు 15 నుంచి 20 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం మొదట్లో భారత్ బాగానే కంట్రోల్ చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తో పాటు, అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసలు కురిపించింది.
ఈ వైరస్ మరింత విస్తరించకుండా ముందస్తుగా నిబంధనలు విధించడంతో, కరోనా చాలా వరకు కంట్రోల్ అయింది.ఎప్పుడైతే ఈ నిబంధనలు ఎత్తివేశారో అప్పటి నుంచి జనాలు రోడ్లపైకి వస్తూ ఉండడం వంటి కారణాలతో ఈ మహమ్మారి విజృంభణ మరింతగా పెరిగిపోయింది.లాక్డౌన్ మినహాయింపుల తర్వాతే వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ భయపెడుతున్నాయి.ఇప్పటికే భారత్ లో 5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి.ప్రభుత్వాలు ఎంత జాగ్రత్తలు చెబుతున్నా, ప్రజల్లో మాత్రం పెద్దగా చైతన్యం కనిపించడంలేదు.గుంపులు గుంపులుగా తిరుగుతూ, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకుండా తిరుగుతుండడం, ఇలా చాలా కారణాలతోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.
రానున్న రోజుల్లోనూ ఈ కరోనా అదుపు తప్పే స్థాయిలో పెరిగే అవకాశం ఉందనే లెక్కలు కూడా ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రాబోయే రోజుల్లో, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రెట్టింపయ్యే అవకాశం ఉందని, భారత్ లో కేసులు సంఖ్య 15 లక్షలకు పైగా దాటే అవకాశం ఉన్నట్లు గా చెప్పడంతో, ఇప్పుడు అందరిలోనూ ఆందోళన పెరిగిపోతుంది.
ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎవరికి వారు స్వీయ నిబంధనలు పాటిస్తూ, కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకోకపోతే, రాబోయే ప్రమాదాన్ని అడ్డుకోవడం సాధ్యం అయ్యేపని కాదు.ఇప్పటికే ఈ వైరస్ ను అదుపు చేసే విషయంలో కేంద్రం చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది.
చాలా రాష్ట్రాల్లో ఈ వైరస్ మహమ్మారి ప్రభావం పెరిగిపోతోంది.ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఆయన ఏ అంశాలపై మాట్లాడుతారనే టెన్షన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి లోనూ కనిపిస్తోంది.అదీ కాకుండా ఇప్పుడు కరోనా వైరస్ మూడో స్టేజి నడుస్తోందనే ప్రకటనలు కూడా మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.