కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుండటం, ఇప్పట్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ పెరిగిపోతుంది.వందలు, వేల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు ఇప్పుడు లక్షల సంఖ్యలో చేరడం, నిత్యం 12 ,13 వేలకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదు అవుతూ ఉండడం, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇవన్నీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కలవరానికి గురి చేస్తున్నాయి ప్రజల్లో కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నా, పరిస్థితి అదుపులోకి రాకపోవడం, చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువైంది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారత్ నాలుగో స్థానంలో ఉంది.ఇది ఆందోళన కలిగించే అంశమే.
జూలై నాటికి భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు గా నిపుణులు హెచ్చరికలు చేస్తూ ఉండడంతో, కేంద్రం ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించాలని చూస్తోంది.భారత్ లో కేసుల సంఖ్య ప్రస్తుతం మూడు లక్షలు దాటింది.
అమెరికా, రష్యా తర్వాత స్థానంలో భారత్ చేరిపోయింది.కాకపోతే కాస్త ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందా అంటే ? భారత్ లో మరణాల శాతం తక్కువగా ఉండడమే.మొదటి, రెండో విడత లాక్ డౌన్ సమయంలో భారత్ లో కేసుల సంఖ్య అదుపులోకి వచ్చినట్టుగానే కనిపించింది.
కానీ ఆ తరువాత వివిధ రాష్ట్రాల ఒత్తిడి మేరకు కేంద్రం లాక్ డౌన్ పై సడలింపులు ఇస్తూ రావడం కారణంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.ఐదో విడత లాక్ డౌన్ ఇప్పుడు నడుస్తున్నా, పెద్దగా ఏమీ ఉపయోగం లేకపోవడంతో జనాలు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు.ప్రస్తుతం మాల్స్, ప్రార్థన మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇలా అన్ని కార్యకలాపాలు మొదలవడంతో ఈ కేసుల వ్యాప్తి మరింత పెరిగింది.
ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో పరిస్థితి అదుపు తప్పినట్టుగా ఉంది.తమిళనాడు లో కొన్ని జిల్లాల్లో కఠినమైన లాక్ డౌన్ అమల్లోకి తీసుకురావాలని అక్కడ కేబినెట్ తీర్మానించింది.
దేశవ్యాప్తంగా మరోసారి కఠినమైన నిబంధనలతో లాక్ డౌన్ విధించాలని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.మరి కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇప్పటికే కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని, లాక్ డౌన్ విధించవద్దు అని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇక జూలైలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, కేంద్రం కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.ఇదే విషయమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.