కరోనా విలయతాండవం నేపథ్యంలో అన్ని దేశాలు దానిని ఎలా కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి.ఇప్పటికే లాక్డౌన్లు, అంతర్జాతీయ సర్వీసుల నిలిపివేతతో ప్రపంచ ప్రజలు గడప దాటి బయటకు రావడం లేదు.
దీనికి మరో కోణం చూస్తే మరణించిన వారి మృతదేహాలను ఖననం చేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది.ఇటలీ, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలలో సాంప్రదాయలను అనుసరించి పూడ్చి పెట్టడమో లేదంటే విద్యుత్ ఆధారిత దహన యంత్రాల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.
స్థానికులకు దిక్కులేని పరిస్ధితుల దేశం కానీ దేశంలో భారతీయులు మరణిస్తే వారి బాధ వర్ణనాతీతం.అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించడం, అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేయడంతో అన్ని దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయారు.
ఇలాంటి పరిస్ధితుల్లో అక్కడ చనిపోయిన ప్రవాస భారతీయుల మృతదేహాల తరలింపు అంతులేని విషాదంగా మారింది.యూఏఈకి చెందిన విమాన సర్వీసులు భారత్లోకి రాకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో అక్కడి ప్రవాసులపై బాగా ప్రభావం చూపుతోంది.
ట్రావెల్ బ్యాన్ అమల్లో ఉన్నందున భారత్, యూఏఈలలో ఎవరైనా చనిపోతే అక్కడి వారు ఇక్కడికి.ఇక్కడి వారు అక్కడికి వెళ్లలేని పరిస్ధితి.దీంతో అయినవారి కడసారి చూపునకు కూడా నోచుకోలేక వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.
కరోనా వైరస్ ఇతర కారణాల కారణంగా కొద్దిరోజులుగా యూఏఈలో కనీసం ఐదుగురు భారతీయులు మరణిస్తున్నారు.వీరిలో కేరళకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉన్నారు.సాధారణంగా ఇక్కడ ఎవరైనా చనిపోతే చట్టబద్ధమైన లాంఛనాలను పూర్తి చేసి విమానంలో భారత్కు తరలిస్తారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షల కారణంగా గత్యంతరం లేని పరిస్ధితుల్లో యూఏఈలోనే తమ వారి అంత్యక్రియలను నిర్వహించుకోవడానికి భారత్లోని కుటుంబసభ్యులు అనుమతిస్తున్నారు.యూఏఈలో అన్ని మతాలకు చెందిన వారి స్మశాన వాటికలు ఉన్నాయి.
హిందూ సమాజానికి సంబంధించి షార్జాలోని సజ్జా, అబుదాబి, దుబాయ్లోని జెబెల్ అలీలో స్మశాన వాటికలు ఉన్నాయి.హిందూ స్మశాన వాటికలో రోజుకి ఒక్క మృతదేహాన్ని మాత్రమే ఖననం చేయడానికి అనుమతిస్తున్నారు.
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కొద్దిమందికి మాత్రమే అనుమతిస్తారు.ఇటీవల కేరళలోని తిరువల్లకు చెందిన ఒక మహిళ మృతదేహాన్ని అబుదాబి సజ్జా వద్ద ఖననం చేశారు.
ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేవలం దగ్గరి బంధువులను మాత్రమే అనుమతించారు.అయితే కడసారి చూపునకు నోచుకోలేకపోవడంతో భారత్కు చెందిన వారి కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ విషాద స్థితిపై సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ… ఇంత కఠినమైన సమయాన్ని చూడటం తమ జీవితంలో ఇదే మొదటిసారని చెప్పారు.చివరికి యుద్ధాల సమయంలోనూ విమాన సర్వీసులు రద్దయిన దాఖలాలు లేవంటున్నారు.