కరోనాకు సంబంధించి బయటకు వస్తున్న ఏ చిన్న వార్త అయినా భయాందోళనకు గురి చేస్తోంది.ఎప్పటికప్పుడు కరోనాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ వార్తలన్నీ ప్రజలకి ఆసక్తిని, ఆశ్చర్యాన్ని, భయాందోళనను కలుగజేస్తున్నాయి.ఇప్పటి వరకు ఈ కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు సరైన వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాకపోవడంతో జనాల్లో తీవ్ర ఆందోళన రేగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ, అన్ని రంగాల్లోనూ ఎంతో పట్టు సాధించినా, ఈ వైరస్ కు సంబంధించి పూర్తిస్థాయిలో మందు ఎందుకు కనిపెట్టలేక పోతున్నారు అనే సందేహాలు కూడా ఉన్నాయి.కాకపోతే ఈ కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన లక్షణాలు మార్చుకుంటూ వస్తూ ఉండటంతో, దీనిపై మరింతగా అధ్యయనం చేస్తే తప్ప దానికి సరైన వ్యాక్సిన్ కనుక్కునే అవకాశం ఉండదు.
ఇదిలా ఉంటే భారత్ లో, తెలంగాణలో ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందుతుంది ? అది ఎలా రూపాంతరం చెందుతుంది అన్న విషయంపై అనేక సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తో పాటు, సిసిఎంబి దీనికి సంబంధించిన పరిశోధనలు చేస్తోంది.
కోవిడ్ 19 జన్యు క్రమాలను విశ్లేషించే క్రమంలో అనేక ఆశ్చర్యకరమైన అంశాలను గుర్తించారు.వెయ్యికి పైగా, వైరస్ నమూనాలను పరిశీలించిన తర్వాత తేలిన విషయం ఏమిటంటే ? మార్చి ఏప్రిల్ లో కనిపించిన వైరస్ స్వరూపానికి, మే నెలలో కనిపిస్తున్న వైరస్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, ప్రపంచవ్యాప్తంగా 11 రకాల వైరస్ రకాలు వ్యాప్తి చెందుతున్నట్లు గా పరిశోధకులు గుర్తించారు.మనదేశంలో రెండు రకాల వైరస్ లు ఉన్నట్టు వారు చెబుతున్నారు.మార్చి నెలలో ఏ 2ఏ , ఏ3, ఏ 3 ఐ, బి 1, బి 4, ఏ 1 రకాల వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు.
ఏప్రిల్ నాలుగో వారం నుంచి ఏ 2 రకం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, మే మొదటి రెండు వారాల్లో మాత్రం ఏ 2 ఏ తో పాటు, బి 4, ఏ 2 రకాలు ఎక్కువగా ఉన్నాయని, దీనికి భిన్నంగా మే మూడో వారం నుంచి, జూన్ రెండవ వారం వరకు ఏ 2 తప్పించి మిగిలిన వాటి ఉనికి పెద్దగా లేదని వారు చెబుతున్నారు.మన దేశంలో గుర్తించిన ఎ2 ఎ వైరస్ రకం వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా 60 శాతానికి మించి ఉందంటూ వారు చెబుతున్నారు.