ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి వేలాది మంది చనిపోతున్నారు.అయితే కేవలం కరోనా ఊపిరితిత్తుల లోకి వెళ్లడం వల్ల చనిపోతున్నారు అనుకుంటే పొరపాటే అంటున్నారు శాస్త్రవేత్తలు.
కరోనా శరీరంలో అటు ఇటు తిరిగి చివరికి మెదడు దగ్గరకి వెళ్లడం వళ్లే మరణాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కోవిడ్ కారణంగా మెదడు దెబ్బతింటుందా…? అని అంటే అవునంటున్నారు స్వీడన్లోని గొథెన్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.
వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై తాము పరిశోధనలు చేశామని వారి రక్త నమూనాలను పరిశీలించినప్పుడు మెదడు దెబ్బతినేందుకు సూచికలైన కొన్ని రసాయనాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.కొవిడ్-19 రోగుల సెరిబ్రోస్పైనల్ ద్రవం (మెదడులో ఉంటుంది), వ్యాధితో మృతిచెందిన వారి మెదడును పోస్ట్మార్టం చేస్తే అక్కడికి వైరస్ ఎలా ప్రవేశిస్తుందో, శ్వాస కేంద్రానికి ఎలా వ్యాపిస్తుందో మరిన్ని వివరాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
‘సార్స్-కొవ్ – 2 మెదడులోని శ్వాసకేంద్రాన్ని విఫలం చేయొచ్చు.ఫలితంగా శ్వాస ఆడకపోవడం, మెదడులోని పీబీసీ మూల కణాలు నాశనం అవుతాయి’ అని వారు తెలిపారు.దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు.
మానవ దేహంలోని ఇతర అంగాలతో పాటు ఊపిరితిత్తులకు వైరస్ ఎక్కువ సోకుతుందన్న సంగతి తెలిసిందే.అయితే, మస్తిష్కంలోని మూల కణాలకూ వైరస్ సోకుతోందని వైద్యులైన ప్రేమ్ త్రిపాఠి, ఉపాసనా రే, అమిత్ శ్రీవాస్తవ, సోను గాంధీతో కూడిన పరిశోధనా బృందం తెలిపింది.
కరోనా వైరస్ సోకిన వారు వాసన చూసే గుణం కోల్పోయే సంగతి తెలిసిందే.ముక్కులోంచి మెదడుకు వైరస్ చేరుకోవడంతోనే ఇలా జరుగుతుందని ‘కింగ్స్ కాలేజ్ లండన్’ శాస్త్రవేత్తలు సైతం భావిస్తున్నారు.కొవిడ్-19 రోగుల మరణాలకు ప్రాథమిక లేదా ద్వితీయ కారణం మెదడు కాకపోయినప్పటికీ దానిని పోస్ట్మార్టం చేస్తే వైరస్ ఎలా ప్రవేశిస్తుందో తెలుస్తుందని పేర్కొన్నారు.