దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది.దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అంచనాలకు అందని స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
గత కొన్ని రోజులుగా 70 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో వైరస్ పై భయాందోళనను పెంచుతున్నాయి.అయితే కరోనా వైరస్ సోకుతున్న వాళ్ల గురించి చేస్తున్న అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే కరోనా కేసులు నమోదైన వాళ్లలో ఎక్కువమంది యువత, మధ్య వయస్కులే అని తేలింది. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని దేశంలో నమోదైన కేసుల్లో 54 శాతం వీరేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కరోనా మరణాలను పరిశీలిస్తే వైరస్ సోకి మరణిస్తున్న వాళ్లలో వృద్ధులే ఎక్కువ మంది ఉన్నారు.
నివేదికల ప్రకారం దేశంలో నమోదవుతున్న మరణాల్లో 60 ఏళ్లకు పై బడిన వాళ్లే 51 శాతం మంది మరణించారని నివేదికలు తెలుపుతున్నాయి.
కేంద్రం ఈ నివేదికలను వెల్లడించి ప్రజలు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.
మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వాళ్ల రికవరీ రేటు 77.02 శాతంగా ఉండగా కరోనా మరణాల రేటు 1.76 శాతంగా ఉంది.ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.43 కోట్ల కరోనా పరీక్షలను నిర్వహించినట్లు వెల్లడించింది.సామాజిక దూరం కఠినంగా పాటించడం ద్వారా ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి 2 లక్షల కరోనా మరణాలు నమోదు కాకుండా ఆపవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.