కరోనా దేశంలో విస్తరిస్తున్న సమయంలో అత్యధికంగా పరీక్షలు నిర్వహించి, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి, ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్న విషయం అందరికీ తెలిసినదే.అయితే వ్యాధి సోకిన వారిని ముందుగా గుర్తించి కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్న నేపథ్యంలో, హర్యానా రాష్ట్రంలోని, ఫతేహాబాద్ జిల్లాలో రెండు గ్రామాలలో కరోనా పరీక్షలను బహిష్కరించింది.
వారు తీసుకున్న ఈ నిర్ణయంతో అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే ఈ రెండు గ్రామాలు ఎందుకు అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
హర్యానా రాష్ట్రం, ఫతేహాబాద్ జిల్లాలో తమస్పురా, అలీపూర్ భరోత ఈ రెండు గ్రామ పంచాయతీలో ఈ నెల 6వ తేదీన ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఈ రెండు గ్రామాలలోకి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన అధికారుల బృందాలను అడ్డుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్ లు బలరామ్ సింగ్, మైనా దేవిలో ఏకగ్రీవ తీర్మానంపై సంతకాలు చేశారు.
ఈ విషయమై ఆ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ మా గ్రామాలలోని ప్రజలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నారని, కానీ ఇక్కడ పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులకు కరోనా లక్షణాలు ఉంటే ఆ వైరస్ మా గ్రామాల్లో విస్తరిస్తోంది అని వారు తెలిపారు.
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించడంతో ఆ గ్రామంలోని ప్రజలు ఎంతో ఆందోళనకు గురవుతున్నారని, అంతేకాకుండా అక్కడ ఎలాంటి వసతులు, మందులు లేవన్న అపోహతో ప్రజలు ఎవరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అక్కడ వైద్య అధికారులు తెలిపారు.
ఫతేహాబాద్ జిల్లా గ్రామాలలోని సంఘటనకు, ఫతేహాబాద్ డిప్యూటీ కమిషనర్ నరహరి సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్న సమయంలో గ్రామ పెద్దలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు.
గత నెలలో ఇదే జిల్లాకు చెందిన నక్తా గ్రామంలో పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి, టెస్టింగ్ పరికరాలను ధ్వంసం చేయడంతో ఆ గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.