ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బ్రిటన్ను సైతం కకావికలం చేస్తోంది.ప్రస్తుతం అక్కడ 1,20,067 మంది కోవిడ్ 19 బారిన పడగా, 16,060 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా సోకిన వారిని రక్షించేందుకు వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి మరి పనిచేస్తున్నారు.అయితే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్)లో పనిచేస్తున్న వారిని రక్షణ పరికరాలు కొరత వేధిస్తోంది.
ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన వైద్యురాలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.27 ఏళ్ల మీనాల్ విజ్ ఆరు నెలల గర్భవతి.అయితే ఎన్హెచ్ఎస్ సిబ్బందికి రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది.అరక్షిత పరిస్ధితుల్లోనే తాము కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని మీనాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
అందువల్ల వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు తగినన్నికల్పించాలని ఆమె ప్రధానిని కోరారు.
కాగా మీనాల్ విజ్ ఆందోళనపై స్పందించిన నేషనల్ హెల్త్ సర్వీస్ అధికారులు బ్రిటన్కు టర్కీ నుంచి పీపీఈ కిట్లు రావాల్సి ఉందని, వాటిలో 4 లక్షల మెడికల్ గౌన్లు కూడా ఉన్నాయని తద్వారా రక్షణాత్మక దుస్తుల కొరత కొంతమేర తీరుతుందని భావిస్తున్నామని తెలిపారు.బ్రిటన్లోని అనేక ఆసుపత్రుల్లోని నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు కేవలం చేతులకు గ్లోవ్స్ వేసుకుని చికిత్స అందిస్తున్నారు.అయితే వైద్యులు ప్రొటెక్టివ్ సూట్లకు బదులు ఏప్రన్లు (తెల్లని గౌన్లు) ధరించాలని బ్రిటన్ ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే.
మరోవైపు కరోనా వైరస్ నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తిరిగి విధులకు హాజరయ్యారు.