కరోనా ఎఫెక్ట్ తో జనమంతా ఇళ్ల నుంచి బయటకి వచ్చేందుకు అల్లాడిపోతున్నారు.అసలు ఈ కరోనా ఎప్పుడు ఎవరి ద్వారా అంటుకుంటుందో తెలియక సతమతం అయిపోతున్నారు.
ఈ దశలో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు.జనాలు ఎవరూ రోడ్ల మీదకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే 21 రోజుల పాటు లాక్ డౌన్ ని ప్రకటించారు.ఈ విషయంలో ఎటువంటి సడలింపులు లేకుండా చూడాలని కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేస్తూ, కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది.
అయినా కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది.దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే విధంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
దీంతో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్దమయినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో 130 కోట్ల వరకు జనాభా ఉన్నారు.ఇంత జనసాంద్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశం ఉన్నట్టుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ కరోనా వైరస్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఘోర ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విషయంలో మరితం కఠినంగా ఉండాలని వైసీపీ భావిస్తోంది.
అందుకే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నాయి.పోలీసులు కూడా కఠినంగా ఈ విషయంలో వ్యవహరిస్తున్నారు.జనాలు ఎవరూ రోడ్ల మీదకు వచ్చినా, వెనకా ముందు చూడకుండా చితకబడుతున్నారు.అయినా 21 రోజుల లాక్డౌన్ భారత్లో సరిపోదని మరిన్ని రోజులు లాక్డౌన్ విధిస్తేనే పరిస్థితులు అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మరో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.21 రోజుల లాక్ డౌన్ సరిపోదని, ఏప్రిల్ 15 తరువాత మరిన్ని రోజులు లాక్డౌన్ ను పొడిగించాలని చూస్తున్నట్టు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు చెబుతున్నారు.ఇప్పటికే అమెరికా, ఇటలీల్లో జరుగుతున్న దుష్పరిణామాలు భారత్లో తలెత్తకుండా ప్రధాని మోదీ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.వైరస్ మరింత విజృంభిస్తే అందరికీ చికిత్స చేసే మౌలిక వైద్య సదుపాయాలు మన దేశంలో అందుబాటులో లేకపోవడంతో కఠినంగా ఇక నుంచి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.