చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడిస్తోంది.ఎప్పుడు ఎటువైపు నుండి ఈ మహమ్మారి అంటుకుంటుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
సామాజిక దూరం పాటించండి, పరిశుభ్రంగా ఉండాలంటూ నెత్తీనోరూ మొత్తుకున్నా ప్రజలు వినరని భావించిన భారత ప్రభుత్వం, కరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలంటే లాక్డౌన్ ఒకటే మార్గమని నిర్ణయించింది.దీంతో దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ను మార్చి 25వ తేదీ నుండి అమల్లోకి తీసుకొచ్చింది.
దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.బయటకు వెళ్లాలంటేనే భయపడేలా చేసిన కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపించడం మాత్రం తగ్గించలేదు.రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్డౌన్ను పలు దశలవారీగా అమలుపరుస్తోంది ప్రభుత్వం.కాగా ప్రస్తుతం 4వ దశ లాక్డౌన్ మే 18వ తేదీ నుండి 31వ తేదీ వరకు కొనసాగుతుంది.
అయితే ఈ 4వ దశ లాక్డౌన్లో ప్రభుత్వం భారీ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు ఈ సడలింపులే తమ కొంప ముంచాయని ప్రభుత్వం గ్రహించింది.
కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజూ పెరుగుతున్నా చేసేదేమీ లేక ప్రభుత్వం చోద్యం చేస్తోంది.మందు లేని రోగంగా కరోనాను ప్రజలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ లేటుగా గ్రహించారు ప్రభుత్వ అధికారులు.
అయితే ఈ 4వ దశ లాక్డౌన్ ఎంతవరకు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి ఉపయోగపడిందనే ప్రశ్నకు సమాధానమే లేదని చెప్పాలి.
దాదాపు రెండు నెలలకు పైగా ఇళ్లకే పరిమితం అయిన ప్రజలు, ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా అని ఆరాటపడ్డారు.
కానీ అసలు ప్రమాదాన్ని మాత్రం వారు గ్రహించలేకపోతున్నారు.ఇక ప్రభుత్వం కూడా ఆర్ధిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామనే ఒకేఒక్క కారణంతో పలు సడలింపులు ప్రకటించింది.
దీంతో ప్రజలు అదే పనిగా రోడ్లపైకి వస్తున్నారు.ఈ కారణంగా పలు చోట్ల సామాజిక దూరం సైతం పాటించకుండా తమతో పాటు తమ తోటీవారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఇక లాక్డౌన్ 4.0 మరో మూడు రోజుల్లో ముగుస్తుండటంతో, ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తంటాలు పడుతోంది.లాక్డౌన్ 5.0ను కొనసాగించాలా, లేక పూర్తిగా లాక్డౌన్ను ఎత్తివేయాలా అనే అంశాలను తేల్చలేక తలపట్టుకుంటున్నారు.అయితే ఈ లాక్డౌన్ 4.0 ఏదైనా చేసిందంటే అది ఖచ్చితంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను పెంచింది.ఇది ప్రజలను భయాందోళనకు గురిచేసే విషయమే అయినప్పటికీ తమవరకు రాలేదుగా అనే అనాలోచిత మార్గంలో పయణిస్తున్నారు.ప్రజలు తమ ఆలోచనా విధానం మార్చుకోకపోతే పరిస్థితులు మరింత చేయిదాటే అవకాశం ఉందనేది నిజం.
కాదు చేదు నిజం!
.