ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే.ఈ కారణంగా దేశ ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి సొంత ఊళ్లకు పయనమయ్యారు.
రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించడంతో చాలా మంది వందల కిలోమీటర్లు కాలినడకన తమ సొంతూళ్లకు చేరుకున్నారు.
అయితే కొంతమంది మాత్రం పోలీసుల కళ్లుగప్పి వాహనాలలో వెళ్లే ప్రయత్నాలు చేశారు.
కానీ వారి పప్పులు ఉడకలేదు.తాజాగా కాశ్మీర్లో ఓ వ్యక్తి ప్రదర్శించిన అతి తెలివికి పోలీసులే అవాక్కయ్యారు.
ఇంతకీ ఆ ఘనుడు ఏం చేశాడని మీరు అనుకుంటున్నారా? పూంచ్ జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులు అంబులెన్స్ సాయంతో తమ గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు.అయితే పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి మరణించినట్లు నటించాడు.
శవాన్ని తమ గ్రామానికి తీసుకెళ్తున్నామని ఖాకీలను బోల్తా కొట్టించాలని చూశారు ఆ ఘనులు.
దీనికి అనుగుణంగా ఓ ఫేక్ డెత్ సర్టిఫికెట్ను కూడా సంపాదించారు.
సూరన్ కోట్ చెక్పోస్ట్కు చేరుకోగానే పోలీసులు అనుమానం వచ్చి అంబులెన్స్ను తనిఖీ చేశారు.అందులో శవంలా ఉన్న వ్యక్తి బతికే ఉన్నాడని వారు పసిగట్టారు.
దీంతో ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేయడమే కాకుండా వారిని క్వారంటైన్కు తరలించారు.మొత్తానికి స్థానికంగా ఈ వార్త సంచలనంగా మారింది.