ఒకప్పుడు బహిరంగంగా ఎవరైనా తుమ్మినా,దగ్గినా ఎవరూ కూడా పట్టించుకొనేవారు కాదు.ఎందుకంటే ఎవరికైనా అవి సహజంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అని అందరూ లైట్ తీసుకొనేవారు.
జలుబు చేసినా అది అంటువ్యాధి అని తెలిసినప్పటికీ కూడా జనాలు బాగానే అలాంటి వారితో సంబంధాలు నెరిపేవారు.కానీ ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎవరు దగ్గినా,తుమ్మినా అది పెద్ద విపరీతానికి దారి తీస్తుందేమో అన్న భయం జనాల్లో మొదలవుతుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లడిస్తున్న సంగతి తెలిసిందే.చైనా,ఇటలీ ల తరువాత స్థానంలో అగ్రరాజ్యం అమెరికా నిలిచింది.
ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి తో అగ్రరాజ్యంలో 1000 మందికి పైగా మృతిచెందిన విషయం విదితమే.
దీనితో జనాలు బిక్కు బిక్కు మంటూ బయటకు రావలి అంటేనే భయపడిపోతున్నారు.ఎవరినీ బయటకు రావద్దు అని,ఒకవేళ వచ్చినా ముఖానికి మాస్క్ పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ అధికారులు ఊదరగొడుతున్నప్పటికీ జనాలు మాత్రం తమ పనులు తాము చేసుకుంటూ పోతూనే ఉన్నారు.తాజాగా అమెరికా పెన్విల్వేనియాలోని హనోవర్లో ఒక ఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా ఉండే గె ర్రిటీ సూపర్ మార్కెట్ కు గురువారం ఒక మహిళ వెళ్ళింది.అయితే సూపర్ మార్కెట్ లోపలి వెళ్తూనే ఆమె తన ముఖానికి ఉన్న మాస్క్ ను తీసేసి పలుమార్లు దగ్గింది.
అంతటితో ఆగకుండా బేకరి ఉత్పత్తులు, మాంసం, పండ్లు, కూరగాయాలుపై కూడా ఆ మహిళ పదే పదే దగ్గడం తో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమెను సూపర్ మార్కెట్ నుంచి బయటకు గెంటేశారు.అయితే ఇప్పటికే అమెరికా ను కరోనా కకావికలం చేస్తున్న నేపథ్యంలో సూపర్ మార్కెట్ యాజమాన్యం కూడా కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ దగ్గిన ఆహారపదార్ధాలను మొత్తం 35 వేల డాలర్లు అనగా రూ.26 లక్షల రూపాయల విలువైన వాటిని పారబోసినట్లు తెలుస్తుంది.
ఓ నిర్మానుష్య ప్రాంతానికి ఆ సరుకులమొత్తాన్ని తీసుకెళ్లి రసాయనాలు పోసి తగులబెట్టారు.
అనంతరం ఆ సూపర్ మార్కెట్ మొత్తాన్ని శానిటైట్ చేశారు.అయితే సదరు మహిళ పై పోలీసులకు సమాచారం అందించడం తో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే సదరు మహిళ ఉద్దేశపూర్వకంగానే ఆహారపదార్థాలపై దగ్గినట్లు పోలీసులు చెబుతున్నారు.ప్రస్తుతం ఆమెను కరోనా టెస్ట్ ల కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
మరోపక్క ఈ ఘటనతో హనోవర్ టౌన్షిప్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.