భారత్ లోని కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే 2వందలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, ఒక్కరు మాత్రమే మృతి చెందారు.
అయితే ఈ కరోనా వృద్ధుల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని ఈ వైరస్ గనుక వారికి సోకితే తట్టుకోవడం కష్టం అని ఎందరో వైద్యులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.అయితే అలాంటి వృద్ధులే ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడినట్లు కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ద దంపతులు ఇటీవలే ఇటలీ వెళ్లిన వారు తమ కుమారుడితో కలిసి ఇండియాకి తిరిగివచ్చారు.సమాచారం అందుకున్న అధికారులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు.
ఆ తర్వాత వీరితో పాటు కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.దీంతో వారిని కొట్టాయం మెడికల్ కాలేజీలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.అయితే ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన సలహాలను క్రమం తప్పకుండా పాటించడంతో ఆ వృద్ధ దంపతులు ప్రాణాపాయ వైరస్ కోవిడ్-19 నుంచి బయటపడగలిగారు.ఈ విషయాన్నీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
అయితే కరోనా ను జయించడానికి వయసు తో సంబంధం లేదు మానసికంగా ధృడంగా ఉంటే ఎంతటి మహమ్మారినైనా ఎదిరించవచ్చు అన్న విషయాన్నీ ఈ వృద్ధ దంపతులు చేసి చూపించారు.