కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న తొలి ఐదు దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి.గత 24 గంటల్లో అక్కడ 828 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 17,337కి చేరగా, 1,29,044 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా కోవిడ్ 19 కారణంగా యూకేలో ఇప్పటి వరకు 420 మంది భారత సంతతి ప్రజలు మరణించినట్లుగా బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకటించింది.బీఏఎంఈ తరగతులకు చెందిన వ్యక్తుల మరణాల సంఖ్య గురించి దేశంలో ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఎన్హెచ్ఎస్ యూకేలోని పలు ఆసుపత్రులలో జాతుల వారీగా మరణించిన వారి జాబితాను విడుదల చేసింది.
17 ఏప్రిల్ 2020 వరకు సంభవించిన 13,918 మరణాలలో 10,244 లేదా 74 శాతం మంది శ్వేతజాతీయులు, 2,252 మంది లేదా 16 శాతం (బీఏఎంఈ) వ్యక్తులు ఉన్నారు.మిగిలిన 10 శాతం మరణాలకు సంబంధించిన వారి జాతుల వివరాలు తెలియరాలేదని ఎన్హెచ్ఎస్ పేర్కొంది.
బీఏఎంఈ సమూహాలలో భారత సంతతికి చెందిన 420 మంది మరణించారు.వీరి తర్వాత 407 మంది బ్లాక్ కరేబియన్లు (3%), 287 పాకిస్తానీ (2%), 263 ఆఫ్రికన్ (2%), 217 ఇతర ఆసియా సంతతి నేపథ్యం (2%), 131 ఇతర బ్లాక్ గ్రూప్ (1%), 89 బంగ్లాదేశ్ (1%) ), 50 మంది చైనీస్ (0%) మరియు 388 ఇతర జాతుల వ్యక్తులు (3%) ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం.బ్రిటన్ జనాభాలో 86 శాతం తెలుపు, 2.5 శాతం భారతీయ సంతతికి చెందిన వారు, 1.1 శాతం బ్లాక్ కరేబియన్ తరగతులకు చెందిన వారు ఉన్నారు.
బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్(బీఏపీఐవో) అధ్యక్షుడు రమేశ్ మెహతా మాట్లాడుతూ.భారత సంతతికి చెందిన వారి కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.తెల్లవారితో పోలిస్తే భారత సంతతి వారిలో గుండె జబ్బులు, ఊబకాయం, డయాబెటిస్ వంటి ఇతర వ్యాధులు ఎక్కువగా ఉన్నందున బ్రిటన్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మెహతా సూచించారు.బ్రిటిష్ ఇండియన్ వాయిస్ ప్రతినిధి ఆశిష్ పోపాట్ మాట్లాడుతూ.
విపత్కర పరిస్ధితుల నేపథ్యంలో పెద్దలకు సహాయ సహకారాలు అవసరమని అన్నారు.చాలా మంది భారతీయులు ఉమ్మడి కుటుంబాల్లో నివసిస్తున్నారని ఆయన తెలిపారు.