ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లక్ డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.భారతదేశంలో మరణించిన వారి పరిస్థితే ఇలా ఉంటే దేశం కానీ దేశంలో మరణించిన వారి సంగతి ఇక వేరే చెప్పక్కర్లేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్ గ్రామానికి చెందిన కాగితపు సతీశ్ కుమార్ ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు.ఈ నెల 12వ తేదీన సతీశ్ గుండెపోటుతో మరణించాడు.
అయితే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో సతీశ్ మృతదేహం భారతదేశానికి వచ్చే వీలు లేకుండా పోయింది.అసలే కొడుకు మరణంతో పుట్టెడు కష్టంలో ఉన్న అతని తల్లిదండ్రులు తాజా పరిణామాలతో చివరి చూపు దక్కుతుందో లేదోనని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ క్రమంలో తమ బిడ్డ మృతదేహాన్ని భారత్కు రప్పించాల్సిందిగా వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ను కోరారు. దీంతో స్పందించిన ఆయన తన కుమారుడు విశాల్ ఆరూరి, నందనం గ్రామానికి చెందిన రాజు తదితరులు కలిసి యూకే అధికారులతో మాట్లాడారు. లండన్లో ఉన్న తెలుగు సంఘాలు, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ లండన్ నేతలు సైతం స్పందించారు. అంతా కలిసి రూ.16 లక్షలు సమకూర్చి సతీశ్ మృతదేహాన్ని లండన్ నుంచి భారత్కు పంపే ఏర్పాట్లు చేశారు.
అతని మృతదేహంతో ఏప్రిల్ 18న లండన్ నుంచి బయల్దేరి ఇస్తాంబుల్ మీదుగా వచ్చే కార్గో విమానం ఏప్రిల్ 20న ఉదయం 2 గంటలకు ముంబై చేరుకోనుంది.
అయితే అక్కడి నుంచి సతీశ్ మృతదేహం స్వగ్రామానికి చేరేలా సాయం చేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరీ రమేశ్.తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి ఈ విషయమై మహారాష్ట్ర అధికారులను సంప్రదించాలని తన కార్యాలయాన్ని ఆదేశించారు.అలాగే మహారాష్ట్ర డీజీపీతో మాట్లాడాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.
అంతా అనుకున్నట్లు జరిగితే సోమవారం రాత్రికి సతీశ్ మృతదేహం స్వగ్రామానికి చేరే అవకాశం ఉంది.
.