కరోనా వైరస్ కారణంగా జపాన్ తీరంలో నిలిపివేసిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్లో చిక్కుకున్న 119 మంది భారతీయుల 22 రోజుల నిరీక్షణ ఫలించింది.వీరందరినీ ఎయిరిండియా ప్రత్యేక విమానంలో గురువారం భారత్కు తరలించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
వీరిలో భారతీయులు సహా శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా పౌరులు ఉన్నారు.ఢిల్లీ చేరుకున్న తర్వాత వీరందరినీ ఐసోలేటెడ్ వార్డుల్లో ఉంచి 14 రోజుల పరిశీలన తర్వాత వారి స్వస్థలాలకు పంపనున్నారు.
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత అధికమవ్వడంతో పాటు డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ప్రయాణించి హాంకాంగ్లో దిగిన ఓ వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపించాయి.దీంతో జపాన్ ప్రభుత్వం ఈ నౌకను ఫిబ్రవరి 5న యోకహోమా పోర్టులో నిలిపివేశారు.
అప్పటికి ఈ నౌకలో 3,711 మంది ప్రయాణికులు ఉన్నారు.అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను ఈ నౌక నుంచి రక్షించాయి.
ఇదే సమయంలో 138 మంది భారతీయులు తమను రక్షించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.వీరిలో 16 మందికి కరోనా వైరస్ సోకడంతో జపాన్లోనే ఉంచి చికిత్స అందిస్తుండగా, ముగ్గురు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.
మిగిలిన 119 మందిని భారత ప్రభుత్వం ఢిల్లీకి తరలించింది.
దీనిపై ఎన్ఆర్ఐ వ్యవహారాల కమీషనర్ నరేంద్ర సవాయికర్ మాట్లాడుతూ.119 మంది భారతీయుల్లో 50 మంది గోవా రాష్ట్రానికి చెందినవారని తెలిపారు.వీరి కుటుంబసభ్యులు.
వారి రాక కోసం ఎదురుచూస్తున్నారని ఆయన వెల్లడించారు.గోవా ప్రభుత్వం పరిస్ధితిని నిశితంగా గమనిస్తోందని, విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుందని నరేంద్ర తెలిపారు.
వైరస్ వ్యాప్తి కారణంగా జపాన్లో చిక్కుకున్న గోవా వాసులను తిరిగి స్వదేశానికి తీసుకురావడంలో సహకరించినందుకు గాను విదేశాంగ మంత్రి జైశంకర్కు, జపాన్లోని భారత రాయబార కార్యాలయానికి సవాయికర్ ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న చైనాకు భారతదేశం ఆపన్న హస్తం అందించింది.సుమారు 15 టన్నుల వైద్య పరికరాలతో కూడిన వాయుసేన ప్రత్యేక విమానాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం వుహాన్కు పంపింది.సహాయక సామాగ్రిని అందించిన తర్వాత భారత విమానం తిరుగు ప్రయాణంలో అక్కడ చిక్కుకున్న 80 మంది భారతీయులను, 40 మంది విదేశీయులను ఢిల్లీకి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
వీరిందరికి ఐసోలేషన్ వార్డులో ప్రత్యేక చికిత్స అందించనున్నారు.