అగ్ర రాజ్యం అమెరికా బహుశా ఎలాంటి విపత్తుకు, ఉగ్రవాదుల దాడులకు భయపడలేదేమో కానీ కంటికి కనిపించని కరోనా మహమ్మారి దెబ్బకు మాత్రం చిగురుటాకులా వణికిపోతోంది.కరోనా పేరు చెప్తేనే అమెరికన్స్ కు వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది.
ట్రంప్ హయాంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం, ప్రజలను అప్రమత్తం చేయకపోవడం, అమెరికన్స్ స్వీయ తప్పిదాల వలన కరోనా అమెరికాలో విలయతాండవం సృష్టిస్తోంది.రెండు నెలల క్రితమే అమెరికాలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా రోజు రోజుకు కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
కరోనా మహమ్మారి ప్రభావం పై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నివేదికలు అందిస్తున్న హాప్కిన్స్ యూనివర్సిటీ తాజాగా ఓ సంచలన విషయం వెల్లడించింది.కరోనా మహమ్మారి కేవలం ఒక్క జనవరి నెలలో ఏ స్థాయిలో అమెరికాపై ప్రభావం చూపిందో వెల్లడించింది.
సదరు వర్సిటీ వెల్లడించిన లెక్కల ప్రకారం కేవలం ఒక్క జనవరి నెలలో నిన్నటికి మొత్తం 79 వేలమంది మృతి చెందారని తెలిపింది.అంటే సగటున రోజుకు సుమారు 2900 మంది మృతి చెందుతున్నారనిఅంచనా వేసింది.
గత నెలలో అంటే డిసెంబర్ నెలలో సుమారు 77వేల మంది మృతి చెందారని వెల్లడించింది.ఇదిలాఉంటే అమెరికాలో కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకూ కూడా ఒక్క నెల కాలంలో ఇన్ని మరణాలు ఎప్పుడూ సంభవించలేదని పేర్కొంది.అంతేకాదు వచ్చే నెల కాలంలో అంటే మూడు వారాలలో సుమారు 80వేల కరోనా మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది.అందరూ భయపడుతున్న యూకె కరోనా కొత్తరకం అమెరికాలో దాదాపు 28 రాష్ట్రాలకు వ్యాప్తి చెందిందని కూడా ఈ యూనివర్సిటీ తన నివేదికలో వెల్లడించింది.