భారత్ లో గత కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం నిన్న వెయ్యి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి.
కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తుండగా మోడెర్నా, ఫైజర్ సంస్థల వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలను నమోదు చేసుకున్నాయి.మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఇలాంటి సమయంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ కరోనా వ్యాక్సిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కాదని తెలిపారు.
వ్యాక్సిన్ వల్ల మహమ్మారి అంతం కాకపోయినా మరణాల సంఖ్యను మాత్రం తగ్గించవచ్చని అన్నారు.వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా వైరస్ ప్రభావం కొనసాగుతుందని.భవిష్యత్తులో సైతం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 54 మిలియన్ల పాజిటివ్ కేసులు నమోదు కాగా 1.32 మిలియన్ల మంది వైరస్ వల్ల చనిపోయారు.నిన్న ఒక్కరోజే ఆరున్నర లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం టెడ్రోస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే కొంతమంది చెప్పినట్టుగా కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ప్రజల్లో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా హెర్డ్ ఇమ్యూనిటీ వస్తోందని త్వరలో వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.భారత్ లోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ వల్లే కేసులు తగ్గుతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వైరస్, కరోనా వ్యాక్సిన్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.