ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచ దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.అలాగే పలువురు వైద్య శాఖ అధికారులు మరియు పోలీసులు, ఇతర సహకాల సంబంధిత అధికారులు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడు కరోనా వైరస్ నుంచి విముక్తి దొరుకుతుందా అంటూ వ్యాక్సిన్ కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు.దీంతో తాజాగా ఆస్ట్రాజెనికా అనే ఓ ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తో కలిసి కరోనా వైరస్ ని అంతమొందించేందుకు తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతం అవుతున్నాయని ఈ ఏడాదిలో సెప్టెంబర్ నెల కల్లా వ్యాక్సిన్ విడుదల చేస్తామని తెలిపారు.అంతేకాక ఈ కరోనా వ్యాక్సిన్ ని భారతదేశంలోనే తయారు చేసేందుకు పలు సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.
దీంతో ఈ విషయం కరోనా వైరస్ బారిన పడినటువంటి ప్రజలకు కొంతమేర ఊరట కలిగించింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైనటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణాంకాలను పరిశీలించినట్లయితే దేశ వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షల 45 వేల పైచిలుకు మంది కరోనా వైరస్ బారిన పడగా, లక్షా 25 వేల మందికి పైగా విజయవంతంగా కోలుకున్నారు.
కాగా మరో 6 వేల తొమ్మిది వందల మందికి పైగా మృతి చెందారు.దీంతో కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.