దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తుందా అంటే అవునని అంటున్నారట విశ్లేషకులు.ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజల నిర్లక్ష్యమో, పాలకుల వైఫల్యమో గానీ కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నట్లు సృష్టంగా తెలుస్తుంది.
ఇప్పటికే ఆసుపత్రిలలో బెడ్లు ఖాళీ లేక, ఆక్సిజన్ సిలిండర్లు సమయానికి దొరకకా కోవిడ్ బాధితులు ప్రాణాలు వదులుతున్నారు.
ముఖ్యంగా దేశ రాజధాని అయితే ఈ సెకండ్ వేవ్ వైరస్ దాటికి చిగురుటాకులా వణుకుతున్నది.
తొలిదశ వైరస్ విజృంభణ తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నా ఇప్పుడు మళ్లీ కేసులు ఈ స్థాయిలో పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది.ఇకపోతే ఢిల్లీలో ఉన్న లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో 1,500 పడకలున్నా అవీ చాలడం లేదట.
కాగా తాజాగా కరోనా కేసుల పెరుగుదలతో ఎల్ఎన్జేపీలో రోగుల రద్దీ కూడా విపరీతంగా పెరిగింది.దీంతో ఒక్కో బెడ్ మీద ఇద్దరు కరోనా రోగులు చికిత్స పొందుతున్న దుస్దితి నెలకొంది.
ఇక బెడ్ షేర్ చేసుకుంటున్న వారేమీ సంబంధీకులు కాదని, కానీ తప్పని పరిస్దితుల్లో తప్పడం లేదని రోగులు వాపోతున్నారట.ఇదిలా ఉండగా ఈ కరోనా సృష్టిస్తున్న భీభత్సం వల్ల ఈ ఆస్పత్రిలో మరో 300 బెడ్లు కూడా పెంచినా అవి కూడా సరిపోక ఆస్పత్రి ఎదుట వందలాది మంది బాధితులు వైద్యం కోసం పడిగాపులు కాస్తుండటం, ఆస్పత్రి వార్డుల వద్ద శవాలు ఒక్కోక్కటిగా పోగవుతుండటం ఇదే కాకుండా ఢిల్లీలో శ్మశానాలన్నీ రద్దీగా మారడంతో అక్కడ కాల్చడానికి కూడా రోజుల కొద్దీ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.ఆక్సిజన్ అందక కరోనా రోగులు కన్నుమూస్తున్న ఘటనలు చూస్తుంటే ప్రస్తుత పరిస్దితుల్లో ప్రాణాల మీద ఆశవదులుకోవలసిందే.