హుజురాబాద్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది.ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడే దృష్టిపెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
సభలు, సమావేశాలు, నాయకుల పర్యటన లతో నిత్యం సందడి సందడిగా వాతావరణం నెలకొంది.రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు తమ అనుచరగణంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక పోవడంతో, ఇక్కడ ఎన్నికల తంతు ముగిసే వరకు ఇదే పరిస్థితి కనిపించబోతోంది.అయితే హుజురాబాద్ పరిణామాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆందోళనలో ఉంది.
ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గం లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది.
నియోజకవర్గంలో నాయకుల పర్యటనలతో ప్రజలు పెద్దగా కరోనా నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారని, రాజకీయ సమావేశాలకు గుంపులు గుంపులుగా హాజరవుతున్నారని, ఎక్కడా కరోనా నిబంధనలు పాటించడం లేదని, హుజురాబాద్ లో నెలకొన్న పరిణామాలను అదుపుచేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్న, ఉపయోగం లేకుండా పోతోందని, ప్రజలు నాయకుల నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఇక్కడ పరిస్థితి అదుపు తప్పుతున్న ట్లుగా వైద్యారోగ్యశాఖ ఆందోళనలో ఉంది .ఇప్పటికే ఇంటింటికి ఆశావర్కర్ల ద్వారా కరోనా కిట్లను పంపిణీ చేస్తుండడంతో, వాటిని వాడుతున్నవారు తమకు కరోనా రాదని ధీమాగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు.
ఈ నియోజకవర్గంలో కరోనా నియంత్రణకు కిట్ల పంపిణీకి ప్రత్యేక నోడల్ ఆఫీసర్ నియమించి , వారికి అవగాహన కల్పిస్తున్నా, చాలాచోట్ల ఈ కరోనా వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని , ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆరోగ్య శాఖ అధికారులు వాపోతున్నారు.హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు ఆరోగ్య శాఖ హెచ్ ఓ డి లు సోమవారం అంతర్గతంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఈ సందర్భంగా కరోనా వైరస్ ప్రభావం మరింత పెరగకుండా ఏం చేయాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించుకున్నారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా ఆరోగ్య శాఖ పరంగా చర్యలు తీసుకుంటున్నా, ప్రజల నుంచి సహకారం లభించకపోవడంతో తమ ప్రయత్నం వృధాగా మారుతోందని, ఇదే తంతు ఎన్నికల వరకు సాగితే హుజూరాబాద్ నియోజకవర్గం లో కరోనా వీర విహారం చేస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.