తెలంగాణలో కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుంది.ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
తాజాగా తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల్లో కరోనా కలకలం రేపుతోంది.బొగ్గు గనుల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
తాజాగా కరోనా బారిన పడి.ఓ కార్మికుడు కూడా మృతి చెందాడు.దీంతో సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.లాక్ డౌన్ ను ప్రకటించి వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు.లేని పక్షంలో తామే స్వయంగా విధులు బహిష్కరిస్తామని సింగరేణి కార్మికులు తెలిపారు.
అయితే పెద్దపెల్లి జిల్లా రామగుండం అర్జీ-1 ఏరియాలోని 11ఏ బొగ్గుగనిలో మార్నింగ్ షిఫ్ట్ కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు.
అనంతరం వారు గనిపై నిరసన చేపట్టారు.కరోనా లక్షణాలతో పలువురు కార్మికులు మృతి చెందారని, మరికొంత మంది వైరస్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.
వెంటనే లాక్ డౌన్ ప్రకటించాలని కార్మికులు డిమాండ్ చేశారు.దీనిపై సింగరేణి యాజమాన్యం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.
కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఇంటికి వెళ్ళిపోయారు.
అయితే గనుల్లో పనిచేసే కార్మికుల్లో ఎవరికి కరోనా ఉందోనన్న ఆందోళన వారి కుటుంబాల్లో సైతం నెలకొంది.
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికుల భద్రత గురించి ఆలోచించాలని డిమాండ్ చేశారు.లేదంటే స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఇళ్లలోనే ఉంటామని కార్మికులు తెలియజేశారు.మరోవైపు తాజాగా తెలంగాణలో మరో 1473 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.అయితే కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇప్పటికే జిల్లాలవారీగా, పట్టణాల వారీగా అధికారులు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి.