యావత్ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఇంకా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.ఇప్పటికే పెద్ద సంఖ్యలో జనం కరోనా బారిన పడుతుండగా, అంతే స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
దీంతో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్డౌన్ను విధించాయి.ఈ క్రమంలో కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది.
గతకొద్ది రోజులుగా అనేక మరణవార్తలు వింటూ వస్తున్న జనానికి ఇది ఊరట కలిగించే వార్త అని చెప్పాలి.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ రేటు తగ్గుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
లాక్డౌన్ వల్ల మాత్రమే కరోనాను అడ్డుకోగలమని భావించిన రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంతో మంచి ఫలితాలు లభిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.ముఖ్యంగా సెకండ్ వేవ్ వ్యాప్తి రేటు గతంతో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని, మరికొన్ని రోజుల్లో ఈ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనాతో కళ్లముందే ప్రాణాలు పోతున్నా, ఏమీ చేయలేని దుస్థితిలో జనం ఉన్నారని, అయితే తమ ప్రాణాలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యాధికారులు అంటున్నారు.
గతకొద్ది రోజులుగా కరోనా విజృంభనతో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్యలు వింటూ వస్తున్న జనానికి, కరోనా సెకండ్ వేవ్ రేటు తగ్గుముఖం పట్టిందనే వార్త నిజంగా గుడ్డిలో మెల్లలా అనిపిస్తోంది.
ఇక దేశంలోని మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ సహా 18 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి.కాగా 26 రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక తెలంగాణలో నేటి ఉదయం 10 గంటల నుండి 10 రోజుల పాటు లాక్డౌన్ అమలులో ఉండబోతున్న సంగతి తెలిసిందే.