కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే.ఈ కరోనా వ్యాప్తి తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం సూచనలు చేస్తున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా ప్రభావం తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది.అయితే ఇప్పుడు తాజాగా మరో టెన్షన్ మొదలైంది.
ఒక డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ రావడం తో పోలీసులకు ఈ కొత్త టెన్షన్ మొదలైంది.విషయం తెలిసిన వెంటనే కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మరోపక్క ఆయన కుటుంబం తో సన్నిహితంగా ఉంటున్న వారిని గుర్తించేపనిలో పడ్డారు అధికారులు. బాధిత యువకుడు ఇటీవల లండన్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ నుంచి అతడిని తీసుకెళ్లిన కారు డ్రైవర్ కూడా సొంతూరుకు వెళ్లడం తో అతడిని కూడా పట్టుకొని క్వారంటైన్ చేసే పనిలో ఉన్నారు అధికారులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ డీఎస్పీ కుమారుడు(23) ఈ నెల 18న లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు.శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కొత్తగూడెం జిల్లాకు కారులో వెళ్లాడు.
అక్కడికి వెళ్లిన తర్వాత కొంత మంది బంధువులను కలిశారు.
20వ తేదీన అతడికి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే అంబులెన్స్లో హైదరాబాద్ తరలించారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా ఉన్నట్టు తేల్చారు.వెంటనే గాంధీ ఆసుపత్రిలోని క్వారంటైన్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా డీఎస్పీ కుమారుడికి వైరస్ ఉన్నట్టు తేలడంతో ఆ వైరస్ అతని తల్లిదండ్రులకు కూడా అంటుకుని ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.దీని వల్ల ఆ డీఎస్సీ ద్వారా ఎక్కడ తమకు కూడా అంటుకుందో అని జిల్లా పోలీసు యంత్రాంగం టెన్షన్ టెన్షన్ గా ఉంది.