దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లాలన్నా, వెనక్కి తీసుకు రావాలన్నా అది పూర్తిగా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది.ఎవరు అధికారంలో ఉంటే వారిమాటే చెల్లుబాటు అవుతుంది.
వారి నిర్ణయాలు అమలు అవుతాయి.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ విధానాలే అమలు చేయబడతాయి.
ప్రస్తుతం దేశం కరోనా కోరల్లో చిక్కుకుంది.విల విల్లాడుతోంది.
గత ఏడాది ఈ తీవ్రత ప్రపంచవ్యాప్తంగా ఉన్నా, భారత్ లో పరిస్థితి అదుపులోనే ఉంది.కానీ రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో మొదటి స్థానానికి వెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉంది.రోజుకు దాదాపు 4 లక్షల కు దగ్గరగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ పేషెంట్లకు సరైన వైద్య సదుపాయాలు అందించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లేవు.ఆక్సిజన్ కొరతతో పాటు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ఇది రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీస్తుంది.అయితే భారత్ లో పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి కారణం ఏంటి అనే విషయం ప్రస్తావనకు వస్తే , భారత ప్రజలతో పాటు, ప్రపంచ దేశాలు రాజకీయ నాయకులు వైపు వేలెత్తి చూపుతున్నారు.
అధికార పార్టీ ప్రతిపక్ష అన్న తేడా లేకుండా అందరూ దీనికి బాధ్యులే అని సమాజం అభిప్రాయపడుతోంది.అయితే అన్ని రాష్ట్రాలు ఈ విషయంలో కేంద్రంపైనే ఆగ్రహంగా ఉన్నాయి.
కేంద్రం తీరు కారణంగానే దేశంలో ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రధానికి ముందుచూపు లేదని విమర్శలు చేస్తుండగా, తాము ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించాము, హెచ్చరించాము.
కానీ రాష్ట్రాలు పట్టించుకోలేదని, ఈ వ్యవహారాన్ని రాష్ట్రాల మీదకు మళ్ళించేందుకు కేంద్రం ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోంది.అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది.సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా ను కంట్రోల్ చేయలేకపోయారని, దేశం ఈ దుస్థితికి రావడానికి కారణం ఆయనేనని, వెంటనే ప్రధాని రాజీనామా చేయాలి అంటూ హ్యష్ ట్యాగ్ ఉద్యమం సోషల్ మీడియా లో మొదలైంది.
అయితే ఈ ట్రెండ్ మొదలవడానికి కారణం ప్రతిపక్షాలు అంటూ బిజెపి మండి పడుతోంది.కానీ ఇప్పుడు ఇది తీవ్రరూపం దాల్చింది.కరోనా కు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు మరింత ఆందోళన పెంచుతున్నాయి.కరోనా ఉద్ధృతి ఈ స్థాయిలో ఉన్నా, చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.
ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయించేందుకు కూడా రాజకీయమే అడ్డు వస్తోంది.దీని పర్యవసనానికి బాధ్యత కూడా ఇప్పుడు ఆ రాజకీయమే తీసుకోవాలి.