ఏపీ ప్రభుత్వం మరోసారి ఇరకాటంలో పడింది.ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం దానిపై రచ్చ జరగడం తెలిసిందే.
ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభించడంతో అందరూ వైసిపి నాయకుల వ్యవహార శైలిని వేలెత్తి చూపుతూ ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వం డైలమాలో పడింది.
కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31 వరకు షట్ టౌన్ ప్రకటించడంతో దాదాపు ఏపీలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.ఇద్దరు ముగ్గురు మించి బయట తిరిగే పరిస్థితి లేదు.
ఎవరు గుంపులుగా తిరగవద్దు అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లు విషయంలో ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు.
ఇది ఇలా ఉండగా మార్చి 31 నాటికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది.31వ తేదీలోగా రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకోకపోతే ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వానికి ఉండదు.ఒకవేళ హడావిడిగా ఒక్కరోజులోనే ఈ తంతు ముగించేద్దామనుకున్నా, అది కుదరని పని.ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.ఆ తరువాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి ఆ తరువాత మాత్రమే వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.అంటే కనీసం ఈ నెల 27వ తేదీన ఈ తతంగం ప్రారంభించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, అది కూడా నాలుగు రోజులపాటు నిరంతరంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే ప్రభుత్వం తాను ఇచ్చిన ఆదేశాలను తామే ఉల్లగించినట్టు అవుతుంది.అంతేకాకుండా సభ నిర్వహణ అంటే మొత్తం శాసన సభ్యులు అందరూ హాజరవ్వాలి.
ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదు అనే వాదన తెరమీదకు వస్తుంది.కానీ బడ్జెట్ ను తప్పనిసరిగా ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దీనిపై ఏం చేయాలనే దానిపై ఏపీ ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చించాలని చూస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ శాసన వ్యవస్థ అంటే శాసన సభతో పాటు మండలి కూడా ఉంటుంది.మండలిని రద్దు చేస్తూ తీర్మానం కేంద్రానికి పంపించారు.
ఇంకా దానిపై ఎటువంటి క్లారిటీ రాలేదు.ఈ నేపథ్యంలో ఉభయ సభలను సమావేశపరచాలా లేక కరోనా ఎఫెక్ట్ కారణంగా సమావేశాలు నిర్వహించకపోతే బడ్జెట్ ను ఏ విధంగా ప్రవేశపెట్టాలి అన్నదానిపై వైసీపీ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది.