ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.ఇప్పటికే మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో బీజేపీ ప్రభావం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు.
ఇప్పుడు వస్తున్న కొన్ని రౌండ్ లలో ఫలితాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మళ్లీ అధికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బిజెపికి పరాభవం తప్పేలా కనిపించడం లేదు.ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లోనూ ఇబ్బందికర పరిస్థితులను బిజెపి ఎదుర్కొంటోంది.
కేరళ, తమిళనాడులో బిజెపి గెలిచే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది.ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కి పెద్దగా ఆశలు లేనట్టుగానే ఫలితాలు వస్తున్నాయి.
ఇదే జరిగితే దేశ వ్యాప్తంగా బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది.రాబోయే ఎన్నికలలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం అనేది కలగానే మారిపోయే అవకాశం కనిపిస్తోంది.
అసలు ఒక్కసారిగా బీజేపీకి ఈ ప్రతికూల పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి అనే విషయంపైనా చర్చ జరుగుతోంది.మామూలుగానే ధరల పెరుగుదల విషయంలో బీజేపీ పై జనాల్లో ఆగ్రహం ఉన్నా, అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి విషయాలపై బిజెపి పై వ్యతిరేకత పెరుగుతూ వస్తున్న సమయంలోనే, సరిగ్గా ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరగడం, దీనిని అరికట్టే విషయంలో కేంద్రం విఫలమైందనే వాదన, సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలనే డిమాండ్ పెరిగిపోవడం, దేశంలో వ్యాక్సినేషన్ కొరత, ముందు చూపు లేకుండా వాక్సిన్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చూడటం, ఇదే సమయంలో దేశంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడడం, ఇలా ఎన్నో అంశాలు బిజెపి ఇమేజ్ ను బాగా డామేజ్ చేశాయి.
బెంగాల్ లో బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మమతా బెనర్జీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఆమె హవా పెరగడంతోపాటు, మమత ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడే ఛాన్స్ ఉంది.ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇవన్నీ బీజేపీకి ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి.ఎలా చూసుకున్నా, రానున్న రోజుల్లో బీజేపీ గడ్డు పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సిందే.