మనిషి జీవితంలో వివాహమనేది కీలక ఘట్టం.అప్పటి వరకు తమ ప్రపంచంలో తమకు నచ్చిన జీవనశైలితో ఉండేవారికి పెళ్లి అనే ఓ ఘట్టంతో ముఖ పరిచయంలేని వారు జీవితంలో ప్రవేశిస్తారు.
ఈ వేడుక కలకాలం గుర్తుండిపోయే విధంగా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు జరుపుకుంటారు.అయితే కరోనా మహమ్మారి ఇలాంటి వారి ఆలోచనలను తలక్రిందులు చేసింది. అట్టహాసంగా పెళ్లి చేసుకుని ఫారిన్లో హనీమూన్కు వెళ్లాలనుకున్న వారికి కోవిడ్ షాకిచ్చింది.వైరస్ తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుందామని భావించి విసిగిపోయి నలుగురి సమక్షంలో తూతూ మంత్రంగా కార్యక్రమం ముగించిన ఘటనలు ఈ మధ్య వెలుగుచూస్తున్నాయి.
తాజాగా స్కాట్లాండ్లో భారత సంతతి జంటకు ఇదే పరిస్ధితి ఎదురైంది. పిరియా, సందీప్ కృష్ణన్ల వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు.
సందీప్ అమెరికాలో, పిరియా లండన్లో నివసిస్తున్నారు.ఈ క్రమంలో వారు మలేషియాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు.
అయితే కరోనా కారణంగా వారి కలలన్నీ కల్లలయ్యాయి.పెళ్లి మాట దేవుడెరుగు.
కనీసం ఇద్దరూ కలుసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. కరోనా ఉద్ధృతి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ వివాహం జరుగుతుందా లేదా అన్న ఆవేదనతో ఈ జంట కుమిలిపోయింది.
అయితే స్టిర్లింగ్ కౌన్సిల్కు చెందిన ఓ రిజిస్ట్రార్ వీరిని ఒడ్డునపడేశారు.స్కాట్లాండ్లోని మూర్స్లో సందీప్- పిరియాలు ఒక్కటయ్యారు.కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్న సందీప్కు ఓ డేటింగ్ యాప్లో పిరియా పరిచయం అయ్యింది.
ఐరోపాలో స్థిరపడిన భారతీయ మహిళలు ఎలా ఉంటారో చూడాలని భావించిన సందీప్ ఓ రోజున డేటింగ్ యాప్లో పిరియా ప్రొఫైల్ను చూశాడు.
ఆమె అందానికి, అభిరుచులకు ఫిదా అయిన సందీప్ పిరియాను పెళ్లి చేసుకోవాలని భావించాడు.న్యాయవాద వృత్తిని అభ్యసించిన పిరియా ఎప్పుడూ యూకే దాటి వెళ్లాలని భావించలేదు.
డేటింగ్ ప్రొఫైల్లోనూ ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించింది.అయితే విధి బలీయమైనది కావడం వల్ల సందీప్తో పెళ్లి కారణంగా పిరియా తన అత్తగారిల్లైన అమెరికాకు వెళ్లక తప్పని పరిస్థితి.