కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తూ కరాలనృత్యం చేస్తుంది.చిన్న, పెద్ద, ధనిక, పేద అని తేడా లేకుండా అందరిని తాకుతుంది.
ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా కరోనా మనకి వస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొని ఉంది.ఈ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ ఉండటంతో వైద్య సదుపాయం అందించడం కూడా కష్టంగా మారిపోతుంది.
అలాగే చనిపోయిన వారిని దహనం చేయడానికి కూడా ఎవరూ ముందుకి రావడం లేదు.ఎవరిలో చూసిన భయం విపరీతంగా పెరిగిపోయి ఉంది.
ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఇక ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి.
ప్రతి రోజు పది వేలకి తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి.
గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని జిల్లాల్లో కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
ప్రభుత్వాన్ని ఈ విషయం మరింత కలవరపెడుతుంది.తాజగా ఏపీలో 10,376 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే ప్రథమం.మొత్తం కేసుల సంఖ్య 1,40,933కి చేరింది.
మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.గడచిన 24 గంటల్లో 68 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది చనిపోయారు.రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,349కి పెరిగింది.
కొత్తగా 3,822 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 75,720 మంది చికిత్స పొందుతున్నారు.మరో వైపు ఏపీ ప్రభుత్వం కరోనాని కట్టడి చేయడానికి అందుబాటులోకి వచ్చిన మెడిసన్ ని కొనుగోలు చేసి వాటిని ఉపయోగిస్తుంది.
అయినా కూడా కేసులని మాత్రం కంట్రోల్ చేయలేక పోతున్నారు.