మొదట్లో ఫర్వాలేదు అన్నట్టు గా కనిపించినా, ఏపీలో మాత్రం ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఆందోళన కలిగిస్తోంది.ముందు నుంచి కరోనా విషయాన్ని ఏపీ ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకోవడమే ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణమనే విమర్శలు లేకపోలేదు.
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కరోనా వైరస్ పై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.అప్పుడు పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ముందస్తు సమాచారం వచ్చినా, ఏపీ లో మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేశారు.
అయితే ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు ధీటుగా ఏపీలో వేగంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.తాజాగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్యులకు ఈ వైరస్ సోకింది.
హిందూపురానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో మరణించాడు.ఈ విషయం గురించి ఉన్నత అధికారులకు చెప్పినా పెద్దగా పట్టించుకోకపోవడంతో అతని శాంపిల్స్ తీసుకుని అంత్యక్రియల నిమిత్తం బంధువులకు వైద్యులు అప్పగించారు.
అయితే ఆ రిపోర్టు వచ్చిన తర్వాత మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.ఆయనకు వైద్యం చేసిన ఆసుపత్రి సిబ్బంది కి ఇప్పుడు పాజిటివ్ వచ్చింది.
ఆ వృద్ధుడికి వైరస్ లక్షణాలు ఉన్నా, వైద్యులు, వైద్య సిబ్బంది తగినంతగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది.ఆ మరణించిన వ్యక్తి ద్వారా ఇప్పుడు వైద్యులకు రావడంతో అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని తీసుకు వెళ్ళిన వారి బంధువుల్లో ఎంతమందికి వచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో మాస్కులు, పీ పీ ఈ లు లేవనే ఆరోపణలు వస్తున్నాయి.ఇటువంటి సమస్యలను గురించి ప్రశ్నించినందుకు వైసీపీ ప్రభుత్వం నర్సీపట్నం డాక్టర్ ని సస్పెండ్ చేసి కేసు నమోదు చేసింది.
ఇప్పుడు అనంతపురంలో వైద్యులకు కరోనా సొకడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనిపిస్తోంది.ఈ సంఘటన ఒక్కడే కాకుండా , ఏపీలో చాలా రోజులుగా పాజిటివ్ కేసులు విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి విజయవాడలో కొద్ది రోజుల క్రితం మరణించాడు.ఈ విషయం తెలిసి కూడా ఆ మృతదేహాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అలాగే ఆ వ్యక్తి మరణించినట్లుగా మూడు రోజుల తర్వాత ప్రకటించారు.
అసలు కరోనా వచ్చి చనిపోతే ప్రభుత్వమే జాగ్రత్తగా అంత్యక్రియలు నిర్వహించాలి.దీనికోసం ఇప్పటికే కేంద్రం గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది.కానీ అవేవి ఏపీలో ఉన్నట్లుగా కనిపించడం లేదు.
ఇక విశాఖలో నూ ఇదే తరహాలో ఓ కేసు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది.భారతదేశంలోకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావడం నిషేధించిన ముందురోజు కువైట్ దేశం నుంచి విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఇండియాకు వచ్చారు.
అయితే ఆ వ్యక్తిని క్వారంటైన్ కు తరలించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో సదరు వ్యక్తి తన చికెన్ మటన్ దుకాణాన్ని యధావిధిగా నిర్వహించుకోవడం తో అతని దగ్గర మాంసం కొన్నవారికి ఎంతమందికి పాజిటివ్ వచ్చి ఉంటుందో అనేది తేలలేదు.ఇప్పుడు కేరళ కర్ణాటక మించిపోయేలా ఏపీలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ కేంద్రం ప్రకటించిన గైడ్లైన్స్ ను అమలు చేస్తూ, కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటి పోయే అవకాశం లేకపోలేదు.